మృత్యువులోనూ వీడని మూడు ముళ్ల బంధం!

మృత్యువులోనూ వీడని మూడు ముళ్ల బంధం!
  • భార్య పురుగుల మందుతో , భర్త రోడ్డు ప్రమాదంలో ఒకే రోజు మృతి 
  • అనాథలుగా మారిన ఇద్దరు పిల్లలు 

ముద్ర, లక్షేట్టిపేట్:  మండలంలోని ఎల్లారం గ్రామానికి చెందిన రేఖేందర్ శరణ్య (28)   పురుగుల మందు తాగి  చికిత్స పొందుతూ  కరీంనగర్ లోని శ్రీ హర ఆసుపత్రిలో శనివారం సాయంత్రం మృతి చెందగా,ఆమె భర్త మల్లికార్జున్( 35) రోడ్డు ప్రమాదంలో అదే రాత్రి మృతి చెందినట్లు ఎస్సై ఎస్. లక్ష్మణ్ ఆదివారం తెలిపారు.  మృతురాలి ఇంటి ప్రక్కనే ఉన్నటువంటి ఓ మహిళ శరణ్యను దుర్బాషలాడి పోలీస్​ కేసు పెట్టడంతో ఆమె   మనస్థాపం చెంది ఇంటి వద్ద పురుగుల మందు తాగిందన్నారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు శరణ్యను లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందిందన్నారు. మృతుని భర్త  మల్లికార్జున్ ఫిర్యాదు మేరకు శరణ్య మరణానికి  కారణమైన వావిలాల రజని, రేఖేందర్ రాణి పై కేసు నమోదు చేశామని ఎస్​ఐ తెలిపారు. కాగా   కరీంనగర్ లో చనిపోయిన శరణ్య మృతదేహాన్ని ఆమె  భర్త  మల్లికార్జున్,  బంధువులతో ఆంబులెన్స్ లో లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి  తను వెనుకాల బైక్ పై తన తోడల్లుడుతో బయలుదేరాడన్నారు. కాగా, కరీంనగర్ చౌరస్తాలో మల్లికార్జున్ బైక్ ఆపి టాయిలెట్ కోసం రోడ్డు దాటుతుండగా  అర్ధరాత్రి   కరీంనగర్ చౌరస్తా వద్ద రాయపట్నం నుంచి లక్షెట్టిపేట వైపు వస్తున్న లారీ అతన్ని ఢీ కొట్టడంతో అక్కడిక్కడే చనిపోయడన్నారు. మృతులకు కుమారుడు ఓంకార్ (7), కూతురు ఇవాంక(5) ఉన్నట్లు తెలిపారు. మృతుని తండ్రి రేఖేందర్ మాధుసుదన్ రావు  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మణ్ పేర్కొన్నారు.