పోలీసు స్టేషన్‌పై వైసీపీ నేతల దాడి...

పోలీసు స్టేషన్‌పై వైసీపీ నేతల దాడి...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- కృష్ణా జిల్లా మచిలీపట్నం తాలుకా పోసలీసు స్టేషన్‌ ముందు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్నినాని , ఆయన కుమారుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణ మూర్తి (కిట్టు) రచ్చ చేశారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వారిని బాధిస్తున్నారంటూ పెద్ద సంఖ్యలో అనుచరులతో పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. 

దీంతో పోలీసు స్టేషన్ ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్టేషన్ లో ఉన్న ఎస్సై చాణిక్యతో పేర్ని నాని , ఆయన అనుచరులు చాలా దురుసుగా ప్రవర్తించారు. స్టేషన్‌ లో ఉన్న సీసీ కెమెరాలను, కుర్చీలను, ఇతర సామాగ్రిని పేర్ని అనుచరులు ధ్వంసం చేశారు. స్టేషన్ ముందు పేర్ని నాని, ఆయన కుమారుడు బైఠాయించి నినాదాలు చేశారు.

రెండు రోజుల క్రితం ఉల్లిపాలెం నూకాలమ్మ తల్లి జాతరలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా.. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులైన కేశన ధర్మతేజ, కేశన మహేష్​లపై 50వ డివిజన్​కు చెందిన వైసీపీ కార్యకర్తలు కొందరు దాడి చేశారు. ఈ ఘటనలో వైసీపీ కార్యకర్తల పై కేసులు పెట్టడంతో పాటు ఎస్ఐ కొట్టారంటూ పేర్ని నాని ఆరోపించారు. ఎస్సై కావాలనే వారికి కొమ్ము కాస్తూ తప్పు చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు.