సీఎం జగన్ బస్సు యాత్ర తిరిగి ప్రారంభం..
ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్ర సోమవారం పునః ప్రారంభం కానుంది. బస్సు యాత్రలో భాగంగా శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి జగన్ మోహన్ రెడ్డిపై రాయిదాడి చేసిన విషయం తెలిసిందే. రాయిదాడితో జగన్ కంటి పైభాగంలో తీవ్ర గాయమైంది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు జగన్ కు చికిత్స నిర్వహించి గాయమైన చోట కుట్లు వేశారు. ఆదివారం విశ్రాంతి తీసుకున్న జగన్.. సోమవారం తిరిగి బస్సు యాత్రను పునః ప్రారంభించనున్నారు.
జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర సోమవారం కేసరపల్లి దగ్గర నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడు వద్దకు బస్సు యాత్ర చేసుకుంటుంది. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం జొన్నపాడు, జనార్దనపురం మీదుగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ నియోజకవర్గంలోకి బస్సు యాత్ర చేరుకుంటుంది. గుడివాడలో బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 8గంటల సమయానికి కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ నుండి ఏలూరు జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశిస్తుంది. బొమ్మలూరు, కలపర్రు, ఏలూరు బైపాస్ మీదుగా దెందులూరు, గుండుగొలను, భీమడోలు, కైకరం, నారాయణపురం వరకు బస్సు యాత్ర కొనసాగనుంది. నారాయణపురంలో రాత్రి బస శిబిరానికి జగన్ చేరుకుంటారు.