అది అసత్యాల పత్రం... మేనిఫేస్టోపై మల్లికార్జున ఖర్గే ఫైర్
న్యూఢిల్లీ: బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోపై విపక్షం భగ్గుమంది. రైతులు, యువత, మహిళల సమస్యలను కాషాయ పార్టీ మేనిఫెస్టో విస్మరించిందని విరుచుకుపడింది. సమాజంలో ఏ వర్గానికీ ప్రధాని నరేంద్ర మోడీ మేలు చేయలేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. బీజేపీ మేనిఫెస్టో సంకల్ప పత్రం కాదని, అసత్యాల పత్రం అని అభివర్ణించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పిన మోడీ రైతులకు కనీస మద్దతు ధరను కల్పిస్తామని మాట తప్పారని ఖర్గే ఆరోపించారు.
మోడీ తన హయాంలో ఏ వర్గానికీ మేలు చేయలేదన్నారు. అలాగే బీజేపీ మేనిఫెస్టో సంకల్ప పత్రం కాదని, క్షమాపణ పత్రంలా ఉందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. ప్రధాని దేశ దళితులు, రైతులు, యువత, గిరిజనులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ మేనిఫెస్టో అసత్యాల పత్రమని దీన్ని ఎవరూ నమ్మరని ఖేరా పేర్కొన్నారు. ఇక బీజేపీ మేనిఫెస్టోలో రైతులకు కనీస మద్దతు ధర ఊసే లేదని కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనటే వ్యాఖ్యానించారు. బీజేపీ మేనిఫెస్టో బూటకపు హామీలు గుప్పించిందని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత ఆతిషి ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ధరల మంట, నిరుద్యోగంపై బీజేపీ పెద్దగా దృష్టి సారించలేదని ఆమె పేర్కొన్నారు.