పెరిగిన పీఎఫ్​కు కేంద్రం ఆమోదం

పెరిగిన పీఎఫ్​కు కేంద్రం ఆమోదం
  • హర్షం వ్యక్తం చేస్తున్న ఈపీఎఫ్​ఖాతాదారులు

ముంబై: ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఐదు కోట్ల మందికిపైగా వేతన జీవులకు లబ్ధి చేకూరనుంది. 2022–-23 ఆర్థిక ఏడాదికి గానూ వడ్డీ రేటును ప్రకటించింది. ఈసారి 8.15 శాతం వడ్డీ రేటుకు ఆమోదం తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మార్చి 28న 8.15 శాతం వడ్డీ రేటును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. బోర్డు ప్రతిపాదనకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు ఓ సర్క్యూలర్ జారీ చేసింది. ఈపీఎఫ్ సభ్యుల ఖాతాల్లో వడ్డీని జమ చేసేందుకు సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలను జారీ చేయాలని పేర్కొంది. దీంతో ఈపీఎఫ్ ఖాతాదారులకు ఈసారి 5 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు అధికంగా రానుంది. ఈపీఎఫ్ఓ గత ఆర్థిక ఏడాదిలో అతి తక్కువగా 8.10 శాతం వడ్డీ ప్రకటించిన విషయం తెలిసిందే. 2022-–23 ఆర్థిక ఏడాదికి గానూ వడ్డీ ఇంకా తక్కువగా ఉండొచ్చని అంచనా వేశారు. ఈసారి వడ్డీ రేటు దాదాపు 8 శాతానికి తగ్గిస్తారని భావించారు. కానీ ఈపీఎఫ్ఓ 5 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు పెంచడం విశేషం. గతేడాది మార్చిలో ఈపీఎఫ్ఓ 8.1 శాతం వడ్డీ రేటును సిఫార్సు చేసింది. ఇది గత నాలుగు దశాబ్దాల్లో కనిష్ట వడ్డీ రేటు. అంతకన్నా ముందు సంవత్సరంలో 8.5 శాతం వడ్డీని ఇచ్చింది ఈపీఎఫ్ఓ. కానీ గతేడాది ఒకేసారి ఏకంగా 40 బేసిస్ పాయింట్స్ వడ్డీని తగ్గించడం ఈపీఎఫ్ ఖాతాదారుల్ని నిరాశపర్చింది. ఈపీఎఫ్ఓ వడ్డీ తగ్గిస్తే ఈపీఎఫ్ ఖాతాదారులకు తమ కంట్రిబ్యూషన్‌పై వచ్చే వడ్డీ తగ్గుతుంది. గతేడాది నాలుగు దశాబ్దాల్లోనే తక్కువ వడ్డీని ప్రకటించడం ఉద్యోగులను నిరాశపర్చింది. 1977–-78 సంవత్సరంలో ఈపీఎఫ్ వడ్డీ 8 శాతం ఉండేది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది.