రామ మందిరం ‘బాల’ సుందరం
- అయోధ్యలో కొలువుదీరిన బాల రాముడు
- ప్రధాని మోడీ ఆధ్వర్యంలో రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ
- 84 సెకన్లపాటు వైభవంగా పూర్తయిన క్రతువు
- అభిజిత్లగ్నంలో కనులపండువగా కొనసాగిన వేడుక
- 11 రోజుల అనుష్టాన దీక్ష విరమించిన మోడీ
- ప్రపంచవ్యాప్తంగా హాజరైన అతిరథ మహారథులు
- శతాబ్దాల భక్తుల నిరీక్షణకు తెర
రామ జన్మస్థానం అయోధ్యలో బాల రాముడు కొలువుదీరాడు. సోమవారం మధ్యాహ్నం దివ్యమైన ముహూర్తంలో.. అభిజిత్లగ్నంలో.. ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో.. రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా పూర్తయ్యింది. సరిగ్గా మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య కాలంలో 84 సెకన్లపాటు కనులపండువగా ఈ క్రతువు నిర్వహించారు. దీంతో సుమారు 500 ఏళ్ల నుంచి ఎదురు చూసిన రామ భక్తుల నిరీక్షణకు తెరపడినట్లైంది.
అయోధ్య : అయోధ్య రామ మందిరంలో కోదండ రాముడి ప్రాణ ప్రతిష్ఠ వైభంగా జరిగింది. ప్రధాని మోడీ అధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు, అతిరథ మహారథులు హాజరై వేడుకను తిలకించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య అపూర్వ ఘట్టమైన రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ పూర్తయ్యింది. ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన స్క్రీన్స్లో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రధాని మోడీతో పాటు 14 జంటలు ఈ క్రతువులో పాల్గొన్నాయి. ఈ ముహూర్తాన ఆలయ ప్రాంగణంతో పాటు అయోధ్య అంతా జైశ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోయింది. పట్టు వస్త్రాలు ధరించి వచ్చిన ప్రధాని మోడీ.. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.
అరుణ్ యోగి రాజ్ చెక్కిన విగ్రహం..
ప్రతిష్టాత్మకమైన రామ్లల్లా విగ్రహాన్ని మైసూరుకు చెందిన అరుణ్ యోగి రాజ్ ఈ చెక్కారు. సుమారు 51 అంగుళాలు ఉన్న ఈ రామయ్య విగ్రహం ఎత్తు 5 అడుగులు. నిజానికి బాల రాముడికి సంబంధించిన ట్రస్ట్ మూడు రకాల విగ్రహాలను చెక్కించింది. అందులో దేనికైతే ఎక్కువ ఓట్లు పడతాయో దాన్ని ఎంపిక చేసుకుంటామని చెప్పింది. అందుకు తగ్గట్టుగానే ఓటింగ్ నిర్వహించి అరుణ్ యోగిరాజ్ చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఇప్పుడు గర్భ గుడిలో కొలువు తీరింది ఈ విగ్రహమే. పట్టు వస్త్రాలతో, ఆభరణాలతో ధగధగా మెరిసిపోతున్నాడు బాల రాముడు. నుదుటన వజ్రనామం చూపు తిప్పుకోనివ్వడం లేదు. బాల రాముడికి తొలిహారతి ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఆ తరవాత సాష్టాంగ నమస్కారం చేశారు. అయోధ్య రాముడు గర్భ గుడిలో కొలువు దీరేంత వరకూ అత్యంత నిష్ఠగా ఉంటానని జనవరి 12వ తేదీన ప్రకటించారు ప్రధాని. అప్పటి నుంచి అదే నిష్ఠను కొనసాగించారు. సోమవారం ప్రాణ ప్రతిష్ఠ ముగియడంతో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై కూర్చున్నారు. ఆ సమయంలోనే తీర్థం తీసుకుని తన కఠిన దీక్షని విరమించారు.