విస్తృతంగా భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు- పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు

విస్తృతంగా భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు- పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు
  • ఎప్రిల్ 25వ తేదీన నియోజకవర్గస్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశాలు
  • హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో 27వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం
  • ఆరోజు పార్టీ అధ్యక్షులు కేసీఆర్  అధ్యక్షతన పార్టీ జనరల్ బాడీ సమావేశం
  • పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి,చర్చించి, ఆమోదించుకొనున్న సమావేశం
  • అక్టోబర్ 10వ తేదీన వరంగల్లో పార్టీ మహాసభ
  • పార్టీ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ పైన పార్టీ శ్రేణులకు కెసిఆర్ అభినందనలు
  • మే నెలాఖరు వరకు ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగించాలని సూచన
  • కంటోన్మెంట్, గోషామహల్, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించిన కేసీఆర్

హైదరబాద్ ముద్ర న్యూస్ : పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఈమేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు ఆదివారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించుకుంటున్న బి.ఆర్.ఎస్ ఆత్మీయ సమ్మేళనాల కార్యక్రమాలకు పార్టీ శ్రేణుల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపిన కేటీఆర్, పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ నిర్వహించుకునే కార్యక్రమాల వివరాలను తెలియజేశారు.  ఏప్రిల్ 25వ తేదీన నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించుకోవాలని, ఈ సమావేశాలకు పార్టీ నియమించిన ఇంచార్జీలు, స్థానిక ఎమ్మెల్యేల అధ్యక్షతన కొనసాగుతుందని,  జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ సమావేశాల నిర్వహణను సమన్వయం చేస్తారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోని అన్నీ గ్రామాలు, వార్డుల్లో ఆ రోజు ఉదయమే పండగ వాతావరణంలో పార్టీ జెండాలను ఎగరవేయాలని, గ్రామాలు, వార్డుల్లో జెండా పండుగ కార్యక్రమాన్ని ముగించుకొని, ఉదయం 10 గంటల కల్లా నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రతినిధులు సభ సమావేశ స్ధలికి చేరుకోవాలని పార్టీ శ్రేణులను కోరారు. 25వ తేదీన రోజంతా పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సభ నిర్వహణ జరగుతుందని, ఈ సమావేశాల్లో పార్టీ ఆధ్వర్యంలో సాధించిన రాష్ట్రాభివృద్ధి, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ తరఫున చేపట్టిన కార్యక్రమాలన్నింటిని విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. ప్రతి పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సభ కనీసం 2500 -3000 మంది ప్రతినిధులతో నిర్వహించుటామన్న కెటియార్, నియోజకవర్గ పరిధిలోని గ్రామ, వార్డ్ పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, మార్కెట్ కమిటీల డైరెక్టర్లు, ఎంపీపీలు, జడ్పిటిసిలు, జడ్పీ చైర్మన్లు, పురపాలికల కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, పురపాలక సంఘాల చైర్ పర్సన్లు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, ఇతర సీనియర్ నాయకులు ఈ సమావేశాలకు హజరుఅవుతారన్నారు. వీరంరిని ఈ సమావేశాలకు హాజరయ్యేటట్లు సమన్వయం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జీలను కేసిఆర్  ఆదేశించినట్లు తెలిపారు.సమావేశాలకు హాజరయ్యే పార్టీ ప్రతినిధులకు అవసరమైన భోజనాలు, ఇతర వసతులను బాగా ఏర్పాటు చేయాలని, ప్రస్తుత వేసవికాలం నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పార్టీ యంఏల్యేలు, ఇంచార్జీలకు కెటిఅర్ సూచన చేశారు.

ఏప్రిల్ 27నహైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం

భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27వ తేదీ రోజు హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని కెటిఅర్ తెలిపారు. 27న తెలంగాణ భవన్లో పార్టీ జనరల్ బాడీ సమావేశం ఉంటుందని, పార్టీ అధ్యక్షులు కే. చంద్రశేఖర రావు  అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సూమారు 300 మంది పార్టీ జనరల్ బాడీ ప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఆరోజు ఉదయం కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు కెసిఆర్  పార్టీ జెండాను ఎగరవేసి ఈ జనరల్ బాడీ సమావేశాన్ని ప్రారంభిస్తారని, ఈ సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి, విస్తృతంగా చర్చించి, వాటిని ఆమోదించుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా భారీ ఎత్తున వరి కోతలు ఉండడం, ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సాధారణంగా పార్టీ ఆవిర్భావం సందర్భంగా నిర్వహించే భారీ సభ/ విస్తృత స్థాయి సమావేశం బదులు అక్టోబర్ 10వ తేదిన భారత రాష్ట్ర సమితి వరంగల్ మహాసభ నిర్వహణ  జరుగుతుందన్నారు.

మే నెలాఖరు వరకు పార్టీ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి పార్టీ నిర్వహించుకుంటున్న ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ పట్ల కెసిఆర్  పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాలను మరింత విస్తృతంగా, కూలంకషంగా మే నెలాఖరు దాకా కుటుంబ వాతావరణంలో కొనసాగించాలని సూచించారు

మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించిన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ 

కంటోన్మెంట్ అసెంబ్లీ ఇంచార్జీగా మర్రి రాజశేఖర్ రెడ్డి, గోషామహల్ నియోజకవర్గం ఇంచార్జీగా నంద కిషోర్ వ్యాస్ బిలాల్, భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జీగా ఎంపీ మాలోతు కవితలను పార్టీ అధ్యక్షులు కే. చంద్రశేఖర రావు  నియమించారు. వీరు ప్రస్తుతం నియోజకవర్గంలో కొనసాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలతో పాటు పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణ మరియు నియోజకవర్గాలకు బాధ్యులుగా కొనసాగుతారు.