అంతిమయాత్రలో తానే!
మానవత్వం చాటుకుంటున్న శంకర్నాయక్
కేసముద్రం-, ముద్ర : ఎవరైనా చనిపోతే ప్రజాప్రతినిధులు వచ్చి పరామర్శించడం.. మృతుల బంధువులను ఓదార్చడం.. మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటించి, సంతాపం తెలపడం సర్వసాధారణం. ఇందుకు భిన్నంగా ఎవరైనా మృతిచెందారని తెలిస్తే చాలు అంత్యక్రియల్లో పాల్గొని వారి పాడే మోయడం అలవాటుగా మార్చుకున్నారు మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్. నియోజకవర్గంతో పాటు తనకు తెలిసిన వారెవరైనా చనిపోతే ఎమ్మెల్యే అక్కడికి వెళ్లి మృతుల బంధువులను పరామర్శించడంతో పాటు అంత్యక్రియల్లో పాల్గొని పాడే మోయడం తప్పనిసరి.
కేసముద్రం మండల కేంద్రానికి చెందిన బాలునాయక్ అనే వ్యక్తి ప్రమాదంలో ఆకస్మికంగా మృతిచెందాడు. మంగళవారం రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ మహబూబాబాద్ నుంచి హుటాహుటినా కేసముద్రం చేరుకొని, బాలునాయక్ మృతదేహానికి నివాళులర్పించి, అంత్యక్రియలో పాల్గొని పాడేమోశారు. ఇలా ఇప్పటివరకు చనిపోయిన వందలాది మంది అంత్యక్రియల్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొని పాడే మోసి వినూత్నతను చాటుకుంటున్నారు.