'గాంగేయ'  ప్రారంభం

'గాంగేయ'  ప్రారంభం

ఎం విజయ శేఖర్ రెడ్డి సమర్పణలో విజయ గౌతమి ఆర్ట్ మూవీస్ బ్యానర్ మీద టి. హేమ కుమార్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం గాంగేయ. ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను బి. రామచంద్ర శ్రీనివాస కుమార్ నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రంలో గగన్ విహారి, అవ్యుక్త హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని నేడు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు సముద్ర ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకులు సముద్ర క్లాప్ కొట్టగా.. సమర్పకులు ఎం విజయ శేఖర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం చిత్ర దర్శకుడు బి. రామచంద్ర శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ.. రామానాయుడు గారిలా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాను నిర్మిస్తున్నాం. దేశ జాతీయ సమగ్రతను చాటి చెప్పేలా.. కుల మత బేధాలు లేకుండా మనిషి మనిషిని ప్రేమిస్తేనే శాంతి చేకూరుతుందనే పాయింట్ మీద సినిమా రాబోతోంది. ఈ చిత్రాన్ని జాతీయ స్థాయిలో ఐదు భాషల్లో నిర్మిస్తున్నామ' అని అన్నారు.

 నిర్మాత టి. హేమ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 'గాంగేయ సినిమాను నేడు ప్రారంభించాం. అందరి సహకారంతో త్వరగా సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నాం. నేడు ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు థాంక్స్' అని అన్నారు. ఎం విజయ్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. 'చాలా మంచి కథతో ఈ సినిమా రాబోతోంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. హీరో గగన్ విహారి మాట్లాడుతూ.. 'అన్ని రకాల ఎమోషన్స్‌తో కూడుకున్న సినిమా ఇది. దైవ భక్తి, దేశ భక్తి, ప్రేమ కథ ఇలా అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. మంచి సినిమాను తీయాలని మా నిర్మాతలు ఎంతో కష్టపడుతున్నారు. ఒక మంచి సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం. మీ అందరి ఆశీర్వాదం మాకు కావాలి' అని అన్నారు.