మూడవసారి ముఖ్యమంత్రి  కేసీఆరే - కామారెడ్డి రూపురేఖలు మార్చుతాం : కేటీఆర్

మూడవసారి ముఖ్యమంత్రి  కేసీఆరే - కామారెడ్డి రూపురేఖలు మార్చుతాం : కేటీఆర్

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: రాష్ట్రంలో మూడవ సారి బిఆరెస్ గెలుపొంది, ముఖ్యమంత్రి గా కేసీఆర్ పదవి బాధ్యతలు చేపడతారని, కామారెడ్డి రూపురేఖలు మార్చుతామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం బిఆరెస్ అభ్యర్థి, సిఎం కెసిఆర్ తరపున కామారెడ్డి లోని భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో రోడ్ షోలో  మంత్రి కేటీఆర్ పాల్గొనగా, గ్రామస్తులు బోనాలతో, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గతంలో కరెంట్ కష్టాలు ఎ విధంగా ఉండే ప్రజలు ఆలోచించాలన్నారు.

గతంలో ఇంత వరి ధాన్యం పండుతుండేనా అని ప్రశ్నించారు. గత రెండు సార్లు గెలిచిన తర్వాత రాష్ట్రంను అభివృద్ది చేసుకున్నామన్నారు. గతంలో ఎవరూ బీడీ కార్మికులకు పట్టించుకోలేదని, దేశంలో 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉంటే బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్, పెన్షన్ లు ఇచ్చేది కేసీఆర్ అన్నారు.కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకొచ్చిన చందంగా కామారెడ్డికి కేసీఆర్ వస్తుండన్నారు. మోడీ పెంచిన సిలిండర్ ధరను కేసీఆర్ తగ్గిస్తుండన్నారు.

మూడవ సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయ్యాకా 5 వేలు పెన్షన్ ఇస్తాడన్నారు. తెల్ల రేషన్ కార్డులు కలిగిన పేదలందరికీ రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ 3 వేల పెన్షన్ ఇస్తామన్నారు. ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత భీమా కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ధరణి నీ రద్దు చేసి మళ్ళీ పట్వారీ వ్యవస్థ తెస్తానని రేవంత్ రెడ్డి అంటున్నాడని అన్నారు.మనకు మూడు గంటల కరెంట్ కావాలా, పట్వారీ వ్యవస్థ కావాలా ఆలోచించాలన్నారు. మనకు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కామారెడ్డి వస్తె ఇక్కడి రూపురేఖలు మారుతాయన్నారు. 30 న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ ను గెలిపించాలి. ఆయన వెంట ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ముజీబ్ ఉద్దిన్ ఉన్నారు.