కలుషిత నీరు తాగిన కూలీలు.. 24 మందికి అస్వస్థత

కలుషిత నీరు తాగిన కూలీలు.. 24 మందికి అస్వస్థత

తెలంగాణలోని  ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పేడు గొల్లగూడేనికి చెందిన 24 మంది వ్యవసాయ కూలీలు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు. ఆ గ్రామానికి చెందిన ఓ రైతు మిర్చి తోటలో పనికి వెళ్లిన కూలీలు భోజనం విరామ సమయంలో సమీపంలోని మరో రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలోని పైపుల వద్ద నీటిని సేకరించి తాగారు. కొద్దిసేపటికి పలువురు వాంతులు చేసుకోవడం, నాలుక తిమ్మిరిగా ఉండటం, కళ్లు తిరగడంతో ఆందోళన చెందారు.  ఈ క్రమంలో మిగిలిన కూలీలు ఆరా తీయగా రైతు తన పొలంలోని డ్రిప్‌ పైపులను శుభ్రపరిచేందుకు పాస్ఫరిక్‌ యాసిడ్‌ అనే రసాయన మందును ఉపయోగించారని.. ఆ పైపుల నుంచే నీరు విడిచిపెట్టినట్లు తేలింది. అస్వస్థతకు గురైన కూలీలందరినీ ట్రాక్టర్‌పై వెంకటాపురం సామాజిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు, సిబ్బంది ప్రాథమిక వైద్యం అదించారు. ముగ్గురు కూలీలకు తీవ్రస్థాయిలో వాంతులు కావడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అస్వస్థతకు గురైన కూలీలందరికీ సామాజిక ఆసుపత్రిలోనే సేవలందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.