ఫ్యాన్ ప్రభంజనం ఖాయం
- మంచి చేసినవారిని ప్రజలు మరిచిపోరు
- చంద్రబాబు మోసాలన్నీ చరిత్రలో నిలిచిపోతాయి
- వైఎస్సార్ సీపీలోకి వెల్లువలా చేరికలు
- జనసేనకు మూకుమ్మడి రాజీనామాలు
- మంత్రి విడదల రజిని
ఏపీ, ముద్ర ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ ప్రభంజనం ఖాయమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. 22వ వార్డు, శ్రీనివాసరావుపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ 18వ డివిజన్ అధ్యక్షుడు కలపాల సత్యనారాయణ, పార్టీ నాయకుడు కలపాల ప్రతాప్ ఆధ్వర్యంలో 400 మంది కాపు యువకులు, 100 మంది మహిళలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరంతా జనసేన పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ... గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గెలిచేది వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. మంచి చేసిన వారిని ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారన్నారు. రాజకీయ చరిత్ర ఇదే చెబుతోందన్నారు. చంద్రబాబు మోసాలు చేయడంలో చరిత్ర సృష్టించారని దుయ్యబట్టారు. ప్రజలను నిలువునా ముంచిన చంద్రబాబునాయుడికి ఈ ఎన్నికల్లో మరోసారి బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. జగనన్న ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాల ఫలితంగా ప్రతి కుటుంబం ఎంతగానో లబ్ధి పొందిందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం అజెండాగా మరింత మెరుగైన పాలన అందించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించి ప్రజలకు మరింతగా స్వర్ణ యుగం అందించడానికి జగనన్న సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు
కాపు యువత స్వచ్ఛందంగా వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్పార్టీలో చేరారని వెల్లడించారు. వీరిలో 90 శాతం మంది మొదట ఓటు వేయబోతున్నారని, జగనన్న చేసిన మంచి పనులకు మెచ్చి వారి తొలి ఓటును ఫ్యాను గుర్తుకే వేయాలన్న సంకల్పంతో వీరంతా పార్టీలో చేరారని పేర్కొన్నారు. ఇంత మంచి మనసున్న యువతకు తాను మరింత మంచి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. గుంటూరు పశ్చిమ ప్రజలు తనపై చూపిస్తున్న ఆదరణను ఎప్పటికీ మరిచిపోనని తెలిపారు. మరింత అభివృద్ధి చేయడం ద్వారా ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. పార్టీలో చేరిన వారిలో కాపు యువత చల్లా మధు, మామిడి అరవింద్, దరిమడుగు బుజ్జి, లగ్గల ప్రసాద్, లంకా అరవింద్, దలవాయి రంజిత్ కుమార్, బి.శ్రీనివాసరావు, ఎం. లక్ష్మీనారాయణ, ఎస్.నవీన్కుమార్, పి.దినేష్కుమార్, ఎన్.రవి, పి.వెంకటేష్, పి.శ్రీనివాసమూర్తి, యాకోబు, మహిళలు ధనలక్ష్మి, ఝాన్సిరాణి, పూర్ణిమ, పద్మ, వెంకటరత్నం, ఆదిలక్ష్మి, రేవతి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు నిమ్మల వెంకటరమణ, అందుగుల సంతోష్, గోపి శ్రీనివాస్, ఆయా డివిజన్ల అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, క్లస్టర్ ఇన్చార్జిలు, సచివాలయ కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.