బడుగుల రాజ్యాధికారం కోసం పరితపించిన వ్యక్తి సర్వాయి పాపన్న: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
![బడుగుల రాజ్యాధికారం కోసం పరితపించిన వ్యక్తి సర్వాయి పాపన్న: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63f248e217cc5.jpg)
వలిగొండ (ముద్ర న్యూస్)బడుగు బలహీన వర్గాల వారి రాజ్యాధికారం కోసం పరితపించిన మహావ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న అని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. వలిగొండ మండలం పులిగిల్ల గ్రామంలో గౌడ సంఘం ఏర్పాటుచేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతమే బడుగు బలహీన వర్గాల కోసం పోరాటాలు జరిపిన పోరుగడ్డ. సర్వాయి పాపన్న బడుగుల రాజాధికారం కోసం అహర్నిశలు కృషి చేశారు. ఒక సామాన్య వ్యక్తిగా పోరాటాన్ని ప్రారంభించి వేల మంది సైన్యంతో నాటి పాలకులను దోపిడీదారులపై వీరుచితంగా పోరాడిన గొప్ప వ్యక్తి పాపన్న అని గుర్తు చేశారు. నాటి నిజాం పాలకులు తాటి చెట్టు కు పన్ను విధించడంతో వారి ఆగడాలపై వీరోచిత పోరాటం చేశారని, నేటి యువతకు ఆయనే స్ఫూర్తి అని అన్నారు.
పులిగిల్ల గ్రామ ప్రజలు చైతన్యవంతులని రాజకీయాలకతీతంగా కుల మతాలకు అతీతంగా సమైక్యంగా అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో విగ్రహ దాత సినీ హీరో పంజాల జైహింద్ గౌడ్, డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వలిగొండ ఎంపీపీ నూతి రమేష్, కాంగ్రెస్ జిల్లా నాయకులు వాకిటి అనంతరెడ్డి, రాష్ట్ర జిల్లా గౌడ సంఘం నాయకులు, గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులు తదితర ప్రజలు పాల్గొన్నారు.