దివ్యాంగులకు కొండంత  అండగా కేసీఆర్ 

దివ్యాంగులకు కొండంత  అండగా కేసీఆర్ 
  • ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్:తెలంగాణ ఉద్యమంలో దివ్యాంగుల పాత్ర   మరువలేనిదని, వారిని గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొండంత అండగా నిలిచారని అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ లోని మాయ గార్డెన్ లో  నియోజకవర్గ దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ...  గత ప్రభుత్వాలు దివ్యాంగులను చిన్నచూపు చూశాయని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్   సంక్షేమానికి పెద్ద పీట  వేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు దివ్యాంగులకు చాలీచాలని పెన్షన్ అందజేయగా...  

మన ప్రభుత్వం ఇటీవల రూ.4,016 పెంచినట్లు వివరించారు. రాబోయే మన ప్రభుత్వంలో రూ.6, 016 పెంచనున్నట్లు చెప్పారు. దివ్యాంగులకు వినికిడి యంత్రాలు, నడవలేని స్థితిలో ఉన్నవారికి మూడు చక్రాల బ్యాటరీ వాహనాలు, స్కూటీలను అందజేస్తున్నట్లు చెప్పారు. విడతలవారీగా దివ్యాంగులకు అందరికీ పరికరాలు అందజేయనున్నట్లు తెలిపారు. రాబోయే ప్రభుత్వంలో అర్హత  ఉన్న దివ్యాంగులందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని  చెప్పారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఆడబిడ్డగా  ఆశీర్వదించి  ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దివ్యాంగుల సహకార సంఘం చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్  దేవేందర్ రెడ్డి, మెదక్ టౌన్ దివ్యాంగుల అధ్యక్షులు ఎండీ.నాసీర్, దివ్యాంగుల విద్యార్థుల జేఏసీ చైర్మన్ విజయ్ కుమార్, దివ్యాంగుల సంఘం సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.