హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్

హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్
  • ప్రతిపక్షాలకు అభ్యర్థులు దొరకడం లేదు                                               
  • బిఆరెస్ పార్టీకి ఎదురు లేదు -స్పీకర్, బాన్సువాడ అభ్యర్థి పోచారం                                                            

బాన్సువాడ, ముద్ర: కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టిస్టారని అసెంబ్లీ స్పీకర్, బిఆరెస్ బాన్సువాడ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  ప్రతిపక్షాలకు అభ్యర్థులు దొరకడం లేదని, గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఆదర్శంగా ఉన్నాయని పేర్కొన్నారు.

బాన్సువాడ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అభ్యర్థిగా  పోచారం శ్రీనివాస రెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు.ఈసందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానుల కోలాహలంతో బాన్సువాడ పట్టణంలో నెలకొన్న పండుగ వాతావరణం నెలకొంది.

ఉదయం ఇలవేల్పు, ఇష్టదైవం తిమ్మాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని నామినేషన్ పత్రాలను స్వామి వారి పాదాల ఉంచి పూజలు  చేశారు. అనంతరం బాన్సువాడ పట్టణంలోని సరస్వతి మాతా దేవాలయం, అయ్యప్పస్వామి దేవాలయాలను దర్శించి పూజలు చేశారు.

అనంతరం నివాసం నుండి నియోజకవర్గ ప్రజలు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులతో కలిసి బాన్సువాడ పట్టణంలోని ప్రధాన రహదారి గుండా ర్యాలీగా బాన్సువాడ RDO కార్యాలయానికి వెళ్ళి రిటర్నింగ్ ఆఫీసర్‌ కు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ దాఖలు అనంతరం పోచారం శ్రీనివాసరెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ
బాన్సువాడ నియోజకవర్గం నుండి BRS పార్టీ తరుపున అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశానని తెలిపారు.నామినేషన్ తో పాటుగా అఫిడవిట్, బిఫాం కూడా ఇచ్చానని,ఈరోజు నుండే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.ప్రజాస్వామ్యంలో అయిదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయని, ఇది రాచరిక వ్యవస్థ కాదని, శాసనసభ్యుడు పదవి పవిత్రమైనదని, పదవిలో ఉన్నవారు హుందాగా ఉండాలని అన్నారు.

ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధి ప్రజల కోసం పనిచేయాలని,
ప్రజలు నచ్చి, మెచ్చే విదంగా ఉండాలి, ప్రజా సమస్యలపై పనిచేయాలని అన్నారు.

శాసనసభ్యుడు రాజ్యాంగం పరిధిలో పనిచేయాలని, రాష్ట్రంలో, నియోజకవర్గంలో సుభిక్షంగా ఉండాలనే ఉద్యేశంతో పనిచేయాలని, అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించాలని అన్నారు.

శాసనసభ్యుడికి బాధ్యతలు ఉంటాయని, వాటిని స్వీకరించగలిగితేనే పోటీ చేయాలని అన్నారు.

సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను అదే స్పూర్తితో పనిచేస్తున్నానని, నేను శాసనసభ్యుడిగా పోటీ చేయడం ఇది ఎనిమిదో సారి అని, 7సార్లు గెలిచానని అన్నారు.

1994 నుండి బాన్సువాడ శాసనసభ్యునిగా పోటీ చేస్తున్నానని,యువకులు, ప్రజల సహకారంతో ఈసారి కూడా ఘనవిజయం సాదించి, బాన్సువాడ నియోజకవర్గంలో మరోసారి ప్రజల సేవకు పునరంకితం అవుతానని అన్నారు.BRS పార్టీ మేనిఫెస్టో అద్భుతంగా ఉన్నదని,కర్ణాటక లో కాంగ్రెస్ పార్టీ వారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులు ఎత్తివేశారని అన్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలో అభివృద్ధి ఎవరితో జరుగుతుందో ప్రజలకు పూర్తి అవగాహన ఉన్నదని, ఎవరిని గెలిపించాలో ప్రజలకు తెలుసని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, జడ్పి చైర్మన్ శోభ, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, అంజిరెడ్డి, ఎజాస్, పాత బాలక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.