వెలిచాల కే అధిష్టానం గ్రీన్ సిగ్నల్?
-
ఢిల్లీలో ప్రకటించడమే మిగిలింది
-
నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు నియోజకవర్గ ఇన్చార్జిల మద్దతు
-
సమీకరణాలతో ప్రవీణ్ రెడ్డి, తీన్మార్ లకు భంగపాటు
ముద్ర ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు కు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అత్యంత విశ్వాసనీయ సమాచారం. అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో భాగంగా వెలమ సామాజిక వర్గం కావడం ఆయనకు కలిసి వచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ నాలుగురు అభ్యర్థుల తుది జాబితాను ముఖ్యమంత్రికి అందజేశారు. రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చించిన పిదప తుది జాబితా విడుదల కానుంది.
కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి మూడు పేర్లను పరిగణలోకి తీసుకున్న స్క్రీనింగ్ కమిటీ, పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, స్థానిక నాయకత్వం తో చర్చించింది. రాజకీయ సమీకరణాల అనంతరం వెలిచాల రాజేందర్ రావు వైపు మొగ్గు చూపింది. అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, తీన్మార్ మల్లన్న లకు అధిష్టానం నిర్ణయం నిరాశ కలిగించింది. అయితే వారికి సముచిత స్థానం కల్పిస్తామని అధిష్టానం భరోసా ఇచ్చినట్లు విశ్వాసనీయ సమాచారం.