మాది ముమ్మాటికీ కుటుంబ పాలనే
హనుమకొండ: ముమ్మాటికి మాది కుటుంబ పాలనే అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. కేసీఆర్ను విమర్శిచేందుకు విపక్షాలకు కారణం దొరకట్లేదు. ఏ తప్పు దొరక్క కుటుంబ పాలన అని కేసీఆర్ను విమర్శిస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి చెబుతున్నా.. మాది కుటుంబ పాలనే అని బరాబర్ చెబుతున్నా అని కేటీఆర్ స్పష్టం చేశారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో రూ. 125 కోట్లతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు.
4 కోట్ల మంది తెలంగాణ ప్రజలంతా మా కుటుంబ సభ్యులే అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతి కుటుంబంలో కేసీఆర్ భాగస్వామే. రైతులందరికీ పెద్దన్నలాగా కేసీఆర్ అండగా ఉన్నాడు. ఆసరా పెన్షలతో వృద్ధులను కడుపులో పెట్టుకున్నాడు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు పేదింటి ఆడబిడ్డలకు కేసీఆర్ మేనమామ అయిండు. కేసీఆర్ కిట్ పథకం అమలుతో సర్కార్ దవాఖానాలో ప్రసవాల కోసం క్యూ కడుతున్నారు. గురుకులాల్లో 6 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా ఆ విద్యార్థులను తయారు చేస్తున్నారు అని కేటీఆర్ తెలిపారు.