సీఎం జగన్​ కుంభకర్ణుడు

సీఎం జగన్​ కుంభకర్ణుడు
  • శ్రీనివాస్​ను భూమి కోసం అవినాశ్​రెడ్డి అనుచరులే చంపారు
  • రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు
  • వాళ్ల తమ్ముడిని ట్రాక్టర్ తో తొక్కించాలని చూశారు
  • పోలీసులు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు
  • రాష్ట్రమంతా ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియానే
  • కడపలో ఏపీ న్యాయ యాత్రలో ఏపీసీసీ చీఫ్​ వైఎస్​ షర్మిల
  • పెండ్లిమర్రి మండలం యాదవపురంలో శ్రీనివాస్ యాదవ్ కుటుంబానికి పరామర్శ

ఏపీ, ముద్ర ప్రతినిధి: ఏపీ సీఎం జగన్​మోహన్​రెడ్డి కుంభకర్ణుడని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల విమర్శించారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఏపీ న్యాయ యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో ఆమె మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుంభకర్ణుడని.. ఇన్నాళ్లు నిద్ర పోయి ఎన్నికలకు ఆరు నెలల ముందు నిద్ర లేచాడా అని అంటున్నారు. . వివేకా హత్య జరిగి 5 ఏళ్లు అయ్యిందని.. హత్య చేసిన వాళ్లు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారని విమర్శించారు. అధికారం ఉండడంతో దోషులు బయట దర్జాగా తిరుగుతున్నారన్నారు. అన్ని ఆధారాలున్నా చర్యలు మాత్రం తీసుకోవడం లేదన్నారు. వైఎస్​ షర్మిల పెండ్లిమర్రి మండలం, నందిమండలం గ్రామంలో పర్యటించగా.. ఆమెకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెండ్లిమర్రి మండలం యాదవపురం గ్రామంలో శ్రీనివాస్ యాదవ్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమి కోసం అవినాశ్​ రెడ్డి అనుచరులు చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కాదన్నారు. భూమి కోసం హత్య చేశారని ఆరోపించారు. రాళ్లతో కొట్టి దారుణంగా చంపారన్నారు. వాళ్ల తమ్ముడిని ట్రాక్టర్ తో తొక్కించాలని చూశారని, అయినా పోలీసులు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిందితులు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అనుచరులన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రజలు ఓట్లేస్తే గెలవలేదా? గెలిపించింది హత్యలు చేయించడానికా? ఇక్కడే ఇంత అన్యాయం జరుగుతుంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో మొత్తం అక్రమాలు, దౌర్జన్యాలు కనిపిస్తున్నాయి. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియానే ఉంది. రాష్ట్రమంతా ఎక్కడా అభివృద్ధి లేదు. వైఎస్సార్ హయాంలో పెండింగ్ ప్రాజెక్ట్ లకు దిక్కులేదు అని ఆమె అన్నారు. ‘కడప స్టీల్ వైఎస్సార్ కల అని, ఆ ప్రాజక్ట్‌ కనుక పూర్తయితే 25 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవన్నారు. శంకుస్థాపనలు చేసినా ఆ ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదన్నారు. ‘జగన్ మోహన్ రెడ్డి కుంభకర్ణుడు. ఆయన అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడుస్తోంది. ఇప్పటిదాకా నిద్రపోయి ఎన్నికలకు ఆరు నెలల ముందు నిద్ర లేచాడు. వివేకా హత్య జరిగి 5 ఏళ్లు అయ్యింది. సీబీఐ అవినాశ్​రెడ్డిని నిందితుడు అని చెప్పింది. అటువంటి వ్యక్తికే మళ్లీ జగన్ టిక్కెట్ ఇచ్చారు. ఇది హత్యా రాజకీయాలను ప్రోత్సహించినట్లే. హత్య చేసిన వాళ్లను గెలిపించాలని చూస్తున్నాడు. వివేకా స్వయానా జగన్ కి బాబాయి. బాబాయి హత్య జరిగితే కనీసం న్యాయం చేసే పరిస్థితి లేదు. నిందితులను దగ్గరుండి మరీ కాపాడుతున్నారు’ అని ఎద్దేవా చేశారు. ఒకవైపు ధర్మం, మరో వైపు డబ్బు. ప్రజలు ఎవరిని గెలిపించాలో ఆలోచన చేయండి అని కోరారు. వైఎస్సార్ లెక్క ప్రజలకు అందుబాటులో ఉంటా. నమ్మకంగా సేవ చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.

సజ్జలపై వైఎస్​ సునీత ఫైర్​

వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. వైఎస్ వివేకాను పక్కన పెట్టాలని చూశారని, అయినా ప్రజా సేవలో ఆయన ముందుకెళ్లాడని చెప్పారు. దీంతో ఈ మనిషినే ఉంచొద్దనుకొని పక్కా స్కెచ్ వేసి హత్య చేశారని చెప్పారు. వైఎస్ షర్మిలను ఎంపీగా చూడాలని వివేకా కోరిక అన్నారు. షర్మిలను చూస్తే వైఎస్సార్ గుర్తుకు వస్తారన్నారు. వైఎస్సార్ గుణ గణాలు అన్ని షర్మిలలో ఉంటాయన్నారు. షర్మిల ఉంటే వైఎస్సార్ ఉన్నట్లు ఉంటుదని వివేకా అనుకున్నారన్నారు. వివేకా హత్య పర్సనల్ విషయం అని మాట్లాడుతున్నారని, ఇది పెద్ద విషయం కాదు అన్నట్లు మాట్లాడుతున్నారని, సజ్జల అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ఫైర్​ అయ్యారు. ‘సలహాదారు అంటే ఎలా ఉండాలో ముందు అర్థం చేసుకోండి.. జగన్ మాటలు సజ్జల చెప్తున్నారు. మా నాన్నను చంపితే నాకు పర్సనల్ ఇష్యూ ఎలా అవుతుంది. స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్ మాటలు విడ్డూరంగా ఉన్నాయి. బాధ్యత లేకుండా అవినాశ్​రెడ్డి ప్రవర్తన ఉంది’ అంటూ ఆమె విమర్శించారు.