వృద్ధుల శవాలతో జగన్​ రాజకీయం

వృద్ధుల శవాలతో జగన్​ రాజకీయం


  • కోడెల శివప్రసాద్ ను బలి తీసుకుంది వైసీపీనే
  • పోలవరం పూర్తి చేసి అంబటి రాంబాబు డాన్సులు వేస్తే జనం అభినందించేవారు
  • రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి
  • సత్తెనపల్లి ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 

సత్తెనపల్లి, ముద్ర: వృద్ధుల శవాలతో రాజకీయం చేసే దుర్మార్గుడు జగన్ మోహన్ రెడ్డి అని  టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ద్వజమెత్తారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... మేం కూటమితో వస్తుంటే జగన్ రెడ్డి ఒంటరిగా వస్తున్నానంటూ ప్రజలను మోసగిస్తూ శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఏప్రిల్ నుంచి నెలకు రూ.4 వేల పింఛన్ ఒకటో తేదీనే మీ ఇంటివద్దకు తెచ్చి ఇస్తాం. జూలై నెలలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పెంచిన పింఛన్ కలిపి రూ.7 వేలు ఇచ్చే బాధ్యత నాదని చెప్పారు. ‘ఎన్నికల కురుక్షేత్రం ప్రారంభమైంది, యుద్దానికి సిద్దంగా ఉండండి. అహంకార దుర్యోధనుడు జగన్ రెడ్డి.  ధర్మాన్ని కాపాడితే  అది మనల్ని కాపాడుతుంది.  వచ్చే ఎన్నికల్లో అహంకార దుర్యోధనుడు జగన్ రెడ్డికి ఓటమి తప్పదు. ప్రజాగ్రహం తుఫాన్ లో వైసీపీ కొట్టుకుపోవటం ఖాయం’ అని చెప్పారు. కోడెల శివప్రసాద్ సేవాభావంతో అభివృద్ధి పనులు చేసి పల్నాటిపులిగా పేరుపొందారని, ఎన్టీఆర్ బసవతారకం ఆస్పత్రి బాధ్యతలిస్తే సమర్దవంతంగా నిర్వహించారని, ఇక్కడ తారకరామ సాగర్ లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టామని, పక్కనే వావిలాల గోపాల కృష్ణయ్య మ్యూజియం ఏర్పాటు చేశామని, జగన్ కోడెల జీవితాన్ని నాశనం చేశారని చెప్పారు. వైసీపీ పాలనలో కోడెలతో ప్రారంభమైన ఆత్మహత్య అనేక మంది ఆత్మహత్యలు, హత్యలతో ఈ జిల్లా ఘోషిస్తుందని చెప్పారు. మన పిల్లల భవిష్యత్తు బంగారుమయం కావాలంటే సైకో పాలన పోవాలని కోరారు. ‘జగన్ ని ఓడించడానికి మీరు  సిద్దమా? కోడెల కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటా..శివరామ్ రాజకీయ భవిష్యత్తుకు నాది బాధ్యత’ అని చెప్పారు. 

రాష్ట్రాన్ని కాపాడుకోవాలి

బీసీ నేత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తన రెండేళ్ల పదవిని వదులుకుని రాష్ట్రం కోసం టీడీపీలో చేరారని చెప్పారు. తగులబడిపోతున్న రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదన్నారు. అమరావతిని జగన్ విధ్వంసం చేశారని, అది నచ్చకే  ఈ ప్రాంత వాసిగా ఎంపీ లావు శ్రీకృష్ట దేవరాయలు టీడీపీలో చేరారని చెప్పారు. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ కూడా రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే టీడీపీతోనే సాధ్యమని పార్టీలో చేరారని చెప్పారు. సత్తెనపల్లికి సమర్దవంతమైన నాయకుడు కన్నా లక్ష్మీ నారాయణ, యువకుడు, ఉత్సాహవంతుడు లావు కృష్ణదేవరాయలు ఎంపీ అభ్యర్థి. ఈ ఇద్దరి నాయకత్వంలో సత్తెనపల్లికి ఏం కావాలన్నా చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడికి ఒక్కడినే రాలేదు, ఒక కూటమిగా వచ్చామని చెప్పారు. వైసీపీ పోవాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని అందరినీ మెప్పింది పొత్తుకు ఒప్పించిన వ్యక్తి పవన్ అని చెప్పారు.  కేంద్రంలో 400 పైగా సీట్లలో ఎన్డీయే గెలుస్తుందని,  రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం అవసరమన్నారు. నాడు హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టింది తానేనని పునరుద్ఘటించారు. విభజనతోనే నష్టపోయిన రాష్ట్రాన్ని తాను విజన్ తో ఈ రాష్ట్రాన్ని నెంబర్ రాష్ట్రంగా తయారు చేస్తానని చెప్పారు. 2014లో  అమరావతి, పోలవరం నిర్మాణాలు చేపట్టామని, అతి తక్కువ సమయంలోనే లోటు విద్యుత్ ని అదిగమించామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 వేల కి.మీ సీసీ రోడ్లు వేశామన్నారు. నేడు జగన్  రూ. 13 లక్షల కోట్లు అప్పు చేశాడని, 1 లక్షా 50 వేల కోట్లు బకాయిలున్నాయని చెప్పారు. కానీ తాను సంకల్పంతో గాడితప్పిన రాష్ట్రాన్ని కేంద్రం సహకారం, పవన్ కృషితో గాడిలో పెడతానని చెప్పారు. ‘వైసీపీ పాలనలో  రైతులు ఎవరైనా ఆనందంగా ఉన్నారా? టీడీపీ హయాంలో కేంద్రం సహకారంతో  పోలవరం 72 శాతం పూర్తి చేశాం. పట్టిసీమ పూర్తి చేసి 120 టీఎంసీల నీళ్లు తెచ్చి ప్రకాశం బ్యారేజీలో స్లాక్ చేసి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా పల్నాడుకి, శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్లిచ్చాం. వైకుంఠపురంలో బ్యారేజీ కట్టి నకిరేకల్ కి నీళ్లు తెచ్చేందుకు నాడు శంకుస్తాపన చేశాం.  నేను అధికారంలో ఉండి ఉంటే అది పూర్తి చేసి ఈ పొలాలకు నీళ్లిచ్చేవాడిని’ అని చెప్పారు.

సత్తెనపల్లికి మంత్రి చేసిందేంటి? 

5 ఏళ్లలో మంత్రి అంబటి రాంబాబు నియోజవకర్గంలో ఏమైనా అభివృద్ధి పనులు చేశాడా? అని ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో ఎన్ని నదులున్నాయో రాంబాబుకి తెలుసా? క్కూసెక్కుకి, టీఎంసీకి తేడా తెలుసా? సత్తెనపల్లి కాలువల్లో పూడిక తీయలేని అసమర్ధ వ్యక్తి రాంబాబు.  రాంబాబుకి మంత్రి పదవి ఇచ్చింది నన్ను, పవన్ ని తిట్టడానికే. టీడీపీ హయాంలో మంత్రి అంటే ఒక సమర్దత, హుందాతనం ఉండేది. రాంబాబు నేడు సంక్రాంతి సంబరాల్లో డాన్సులు వేస్తున్నాడు. పోలవరం నిర్మించి డాన్సులు వేసి ఉంటే అందరూ చప్పట్లు కొట్టేవారు.  సంక్రాంతి సంబరాలకు ఒక్కో పింఛన్ లబ్దిదారుని నుంచి రూ. 200 చొప్పున రూ. 10 లక్షలు వసూలు చేశారు.  ఇంతకంటే దౌర్బాగ్యం మరొకటి ఉందా? డ్రైనేజీలో పడి చనిపోయిన బీసీ యువకుడికి వచ్చిన నష్టపరిహారంలో 50 శాతం వాటా ఇవ్వలేదని ఆ చెక్కు బాధిత కుటుంబానికి ఇవ్వని వ్యక్తి రాంబాబు. రాంబాబు అక్రమ మైనింగ్ పై వైసీపీ కార్యకర్తలే కోర్టుకెళ్లారు. ఎన్నికల్లో రాంబాబును చిత్తుచిత్తుగా ఓడించి కన్నాను గెలిపించాలి. జగన్ లాంటి దుర్మార్గుడు వస్తే  మీ ప్రాంతం ఎడారి అవుతుంది. నాగార్జున సాగర్ లో నీరు పారవు, మీ కన్నీళ్లు పారుతాయి. తాగడానికి నీళ్లుండవు. నధుల అనుసంధానంతో మీ పొలాలకు  నీరిస్తాం’ అని హామీ ఇచ్చారు.

జాబు రావాలంటే బాబు రావాలి

రాష్ట్రంలో యువత మేలుకోవాలని చంద్రబాబు కోరారు. జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ అంటూ యువతను జగన్ రెడ్డి మోసం చేశారని ఆయన విమర్శించారు. ‘జాబు రావాలంటే బాబురావాలి. జగన్ మోహన్ రెడ్డి మాటలు అబద్దాల పుట్ట. 14 సంవత్సరాల నా పాలనలో ఎనిమిది డీఎస్సీలు నిర్వహించాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే పెడతా. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. ప్రపంచంలో ఉండే కంపెనీలను తీసుకొచ్చి వర్క్ ఫ్రం హోమ్ సదుపాయం కల్పిస్తాం. రాబోయే రోజుల్లో మన ఇంట్లోనే కూర్చొని పనిచేసే విధానాన్ని తీసుకొస్తాం. చిన్నారుల భవిష్యత్​కు భరోసా కల్పిస్తాం. రాష్ట్రంలో జేబ్రాండ్ మద్యంతో ప్రజల్ని దోచుకోవడమే కాకుండా 25 ఏళ్ల పాటు మద్యంపైన వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. రూ.60 బాటిల్‍ రూ.200కు పెంచి దోచుకుంటున్నారు. దీనిపై సమాధానం చెప్పే ధైర్యం జగన్ మోహన్‍ రెడ్డికి ఉందా.. సమాధానం చెప్పకపోతే ఓటు అడిగే హక్కు లేదు. మందుబాబులకు సైతం నాణ్యమైన మద్యం అందిస్తాం. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ దొరుకుతున్నాయి. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గంజాయి, డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలిస్తాం. వీటిపై కఠినంగా వ్యవహరించి యువతను కాపాడుతాం’ అని హామీ ఇచ్చారు.

సూపర్ సిక్స్

‘తాము సూపర్ సిక్స్ పథకాలతో మీ ముందుకొస్తున్నాం. గతంలో డ్వాక్రా సంఘాలు మేమే పెట్టాం, పొదుపు ఉద్యమం నేర్పించాం. దీపం కింద వంట గ్యాస్ ఇచ్చాం, ఉద్యోగాలు, కాలేజీల్లో 33% రిజర్వేషన్లు కల్పిచ్చాం. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల్లోపు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తాం. తల్లికి వందనం పథకంలో భాగంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా విద్యార్థులకు ఒక్కొరికీ రూ.15వేల చొప్పున అందజేస్తాం. ఒక కుటుంబంలో ముగ్గురు, నలుగురు విద్యార్థులున్నా అందరికీ అమ్మకు వందనం పథకం వర్తింపజేస్తాం. వంట గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత నాది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.20 వేల ఆర్థికసాయం చేసి రైతును రాజుగా మార్చే బాధ్యత మేం తీసుకుంటాం. ఈ దుర్మార్గుడు రూ.10 ఇచ్చి రూ.100 జలగ మాదిరి లాగేస్తున్నారు. పూర్ టూ రిచ్ కార్యక్రమంలో భాగంగా పేదరికాన్ని నిర్మూలిస్తాం. ప్రతి దాంట్లో పన్నులతో ప్రజలను దోపిడీ చేయడంతో నిత్యావసర ధరలు పెంచి దోచుకుంటున్నారు. పెట్టుబడులు సాధిస్తాం, పరిశ్రమలు తెస్తాం, ప్రతి ఎకరాకు నీళ్లిస్తాం, మీ ఆదాయాన్ని పెంచడమే కాకుండా ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరిగే విధంగా కార్యక్రమాలు చేస్తాం’ అని తెలిపారు.

సత్తెనపల్లి ప్రజలకు హామీలు

‘రోడ్లన్నీ రిపేర్ చేసే బాధ్యత తీసుకుంటాం. అందరి ఆమోదయోగ్యంతోనే అమరావతిని రాజధానిగా పెట్టాం. అమరావతికి 170 కిలోమీటర్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతాం. మంత్రి అంబటి రాంబాబు చేసిన అభివృద్ధి నిల్.. అవినీతి పుల్. కొండమోడు నుంచి సత్తెనపల్లి రోడ్డు అధ్వానంగా మారింది. టీడీపీ హయాంలో టెండర్ ఖరారు చేస్తే ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు ఇది జాతీయ రహదారిగా మార్చారు.. రహదారిని తొందరగా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. సత్తెనపల్లి నుంచి అచ్చెంపేట దారిలో రైల్వే హైలైన్ బ్రిడ్జి శాంక్షన్ చేపిస్తాం. దానికి కావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్స్ ఇస్తాం. సత్తెనపల్లిలో డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరిస్తాం. అధ్వానంగా ఉన్న నకిరేకల్-అమరావతి మేజర్ కాలువ రోడ్డును అభివృద్ధి చేస్తాం. అమరావతికి సెటిలైడ్ టౌన్షి్ప్ సత్తెనపల్లి.. అమరావతి  అభివృద్ధి చెందితే వాటి బెనిపిట్స్ మీకొస్తాయి. అమరావతి పూర్తైతే సంపద, ఉద్యోగాలు వస్తాయి.. అమరావతి ప్రజా రాజధానిగా ప్రపంచంలోనే అగ్రభాగాన ఆదర్శంగా తయారు చేసే బాధ్యత నాది. మీరందరూ ఒక చైతన్యంతో కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఐకమత్యంగా కలిసి కూటమి గెలుపుకు కృషి చేసి.. పొత్తును ఆశీర్వదించాలని చంద్రబాబు నాయుడు ప్రజలను కోరారు.