ఐదేళ్లలో రాష్ట్ర భవిష్యత్తు నాశనం 

ఐదేళ్లలో రాష్ట్ర భవిష్యత్తు నాశనం 
  • ‘విధ్వంసం’ పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు
  • వలంటీర్లు అంటే గౌరవం: పవన్‌ కళ్యాణ్
  • స్వేచ్ఛగా మాట్లాడలేని రాజకీయాలు వద్దు: రామకృష్ణ

విజయవాడ: ఐదేళ్లలో రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ ఆలపాటి సురేశ్‌ కుమార్‌ రచించిన ‘విధ్వంసం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో గురువారం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు పుస్తకాన్ని ఆవిష్కరించి, తొలి ప్రతిని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్‌లాంటి దుర్మార్గుడు వస్తారని తెలిస్తే అమరావతి రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చేవారు కాదని అన్నారు. ప్రజారాజధాని కోసం అన్నిఆలయాల్లో పూజలు చేసి అమరావతిని ఏర్పాటు చేస్తే ముక్కోటి దేవతలు కూడా జగన్‌ నుంచి అమరావతిని కాపాడలేకపోయారని వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసమైంది.

వైసీపీ అరాచకాలకు తనతో పాటు పవన్‌ కల్యాణ్‌, ప్రజలు కూడా బాధితులే అన్నారు. విధ్వంసం అనేది ఒక పుస్తకం కాదని ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న ధర్మాగ్రహంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో విధ్వంసకర పాలనపై పుస్తకం రావడం చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు. నియంతపాలనలో ప్రజాస్వామ్యం విధ్వంసమైందన్నారు. ఐదు కోట్ల మంది ప్రజల మనసులో ఏముందో 185 అంశాలతో ఇందులో స్పష్టంగా రాశారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిని సైకో అని పిలుస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని, ఐదేళ్లుగా అమరావతిలో ఆస్తులను విధ్వంస చేశారని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో ఆటలాడి ఇప్పుడు నాలుగో రాజధాని అంటున్నారని వ్యాఖ్యానించారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ ప్రతిపక్షాలన్నీ ఎందుకు కలిసి రావాలో తాను చెప్పిన మాటలకు ఈ పుస్తకం ద్వారా అర్థం అవుతుందన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు ఎందుకు చీలకూడదో ఈ పుస్తకంలో వివరించారు. రాష్ట్రంలో 33వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అవుతున్నారని తాను చెప్పలేదని కేంద్ర మంత్రి చెప్పటంతో ప్రపంచానికి తెలిసిందన్నారు. వలంటీర్లు సేకరించిన డేటా హైదరాబాద్‌లో మాయం కావటం వల్ల ఇలా జరిగిందన్నారు. వలంటీర్లు అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. వారి భవిష్యత్తుకు జనసేన కృషి చేస్తుందన్నారు. 

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా, రాజధాని సమస్యలు వచ్చినప్పటి నుంచి వామపక్షాలతో టీడీపీ కలిసి పోరాడిరదని ఈ మధ్య తెలుగుదేశం వెనుకంజ వేసిందన్నారు. పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించినందుకు ఎంపీ గల్లా జయదేవ్‌ రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారని తెలిపారు. స్వేచ్ఛగా మాట్లాడలేని రాజకీయాలు వద్దనేలా ప్రజల్లో మార్పు రావాలని కోరారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామంటే వైసీపీ, టీడీపీ ఎంపీలు కనీసం అర్జీ ఇవ్వలేకపోయారని చెప్పారు. రాష్ట్రంలో లిక్కర్‌ స్కామ్‌పై టీడీపీ కేంద్రానికి ఫిర్యాదు చేయలేకపోయిందన్నారు. రాష్ట్రంలో విధ్వంస పాలనపై పుస్తకం తీసుకువచ్చిన జర్నలిస్టు సురేష్‌ కుమార్‌ను అభినందించారు. 

సభకు అధ్యక్షత వహించిన విశాలాంధ్ర సంపాదకులు ఆర్వీ రామారావు మాట్లాడుతూ రాజకీయాలను ఈసదించుకున్నంత మాత్రనా వాటి ప్రభావం ప్రజలపై లేకుండా పోదన్నారు. గత ఐదేళ్ల పాలనలో ఎంత విధ్వంసం జరిగిందో ఈ పుస్తకం ద్వారా తెలుస్తుందన్నారు. ఆర్థిక అంశాల సారాంశమే రాజకీయం అన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అమలు చేసే విధానాలు ప్రజలకు తెలియజేయటం జర్నలిస్టు విధి అన్నారు. 

ఈ సభలో ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు, అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులు ఏ.శివారెడ్డి, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ప్రసంగించారు. అనంతరం పుస్తక రచయిత ఆలపాటి సురేష్‌కుమార్‌ను అతిథులు ఘనంగా సన్మానించారు.