నా కొడుకు గెలవకూడదు.. ఏకే ఆంటోనీ సంచలన వ్యాఖ్యలు

నా కొడుకు గెలవకూడదు.. ఏకే ఆంటోనీ సంచలన వ్యాఖ్యలు
  • లోక్‌సభ ఎన్నికల్లో తన కొడుకు ఓడిపోవాలన్న కాంగ్రెస్ కురువృద్ధుడు
  • తన కొడుకు పోటీ చేస్తున్న బీజేపీ కూడా పరాజయం పాలవ్వాలని వ్యాఖ్య
  • గతేడాది బీజేపీలో అనిల్ ఆంటోనీ.. పతనంతిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ

కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు ఏకే ఆంటోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతేడాది బీజేపీలో చేరి ప్రస్తుతం కేరళలోని పతనంతిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న తన కుమారుడు అనిల్ ఓడిపోవాలని కోరుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. అనిల్‌కు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని, తన కొడుకు పోటీ చేస్తున్న పార్టీ కూడా ఓడిపోవాలని అన్నారు. దక్షిణ కేరళలోని పతనంతిట్టలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలపించాలని కోరారు. కాంగ్రెస్ నాయకుల పిల్లలు బీజేపీలో చేరడం తప్పేనని ఆయన వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ నా మతం’ అని ఏకే ఆంటోనీ అన్నారు. తన కొడుకు రాజకీయాలపై పదేపదే వస్తున్న ప్రశ్నలకు ఆయన ప్రతిస్పందించారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు అనిల్ బీజేపీలో చేరడంపై మీడియా పదేపదే ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సొంత కుమారుడు ఓడిపోవాలంటూ ఆంటోనీ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

కాగా గతేడాది ఏప్రిల్‌లో అనిల్ బీజేపీలో చేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బీబీసీ రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని అనిల్ విమర్శించారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. ఇక గత నెల మార్చి 15న ఎన్నికల ప్రచారం కోసం కేరళ వెళ్లిన ప్రధాని మోదీ.. అనిల్ ఆంటోనీపై ప్రశంసల జల్లు కురిపించారు. అనిల్ ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఉన్నారని కొనియాడారు. పతనంతిట్టలో బీజేపీ అభ్యర్థి అనిల్ ఆంటోనీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఇక పతనంతిట్ట లోక్‌సభ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ నుంచి అనిల్ ఆంటోనీ, కాంగ్రెస్ తరపున సిట్టింగ్ ఎంపీ ఆంటో ఆంటోనీ, సీపీఎం నుంచి నుంచి థామస్ ఐజాక్‌ బరిలోకి దిగారు.