రూ. 160 కోట్లు దోచేసిన ముఠా అరెస్ట్​

రూ. 160 కోట్లు దోచేసిన ముఠా అరెస్ట్​

న్యూఢిల్లీ: నకిలీ కాల్ సెంటర్ల ద్వారా అమెరికన్ల నుంచి 20 మిలియన్ డాలర్లకుపైగా (రూ.160 కోట్లు) దోచేసిన అంతర్జాతీయ సైబర్ ముఠా గుట్టురట్టు చేశారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీ సహా దేశంలోని పలు ప్రాంతాలు, ఉగాండాలో కాల్ సెంటర్ల నిర్వహించిన కేటుగాళ్లు.. అమెరికా అధికారుల్లా నటించి మోసాలకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇంటర్‌పోల్‌ల సమన్వయంతో ఢిల్లీ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి సైబర్ నేరగాళ్లు ఆటకట్టించారు. మోసాలకు పాల్పడుతున్న నలుగుర్ని అరెస్టు చేశారు.వీరిని పార్థ్‌ అర్మార్కర్‌ (28), వత్సల్‌ మెహతా (29), దీపక్‌ అరోరా (45), ప్రశాంత్‌ కుమార్‌ (45) గుర్తించినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. భారత్‌, అమెరికా, ఉగాండాలోని కొందరు సైబర్‌ నేరగాళ్లు.. కాల్ సెంటర్ల ద్వారా భారీ మోసాలకు పాల్పడుతున్నట్లు ఎఫ్‌బీఐ, ఇంటర్‌పోల్ నుంచి ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది. కేటుగాళ్లు అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ అధికారుల్లా నటిస్తూ భారీ మొత్తం దోచేసినట్టు గుర్తించారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మొదట గుజరాత్‌కు చెందిన పార్థ్‌ అర్మార్కర్‌ను పట్టుకున్నారు.పార్ధ్ ఇచ్చిన సమాచారంతో ప్రధాన సూత్రధారి అహ్మదాబాద్‌కు చెందిన వత్సల్‌ మెహతాను అరెస్టు చేశారు. తర్వాత దీపక్‌ అరోరా, ప్రశాంత్‌ కుమార్‌లను ఉత్తరాఖండ్‌లో పట్టుబడ్డారు. ‘‘సోషల్‌ మీడియా, డార్క్‌ నెట్‌, ఇతరత్రా వేదికల ద్వారా పక్కా ప్లాన్‌తో నిందితులు మోసాలకు పాల్పడ్డారు.. ధనవంతులు, టెక్నాలజీ అంతగా తెలియనివారు, ఒంటరి వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నారు’ అని ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం కమిషనర్ హెచ్ఎస్‌జీ ధలీవాల్ తెలిపారు.