కాంగ్రెస్ గెలిస్తే బతుకులు ఆగమైతయ్ 

కాంగ్రెస్ గెలిస్తే బతుకులు ఆగమైతయ్ 
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం... ప్రధానిని కలిస్తే తప్పేంది?
     
  • బీజేపీ, కాంగ్రెస్ పొత్తు ప్రసక్తే ఉండదు
     
  • ప్రధాని వస్తే దొంగలా దాచుకున్న నేత కేసీఆర్
     
  • ఏ ముఖం పెట్టుకుని కరీంనగర్ లో సభ పెడుతున్నావ్?
     
  • ప్రజాహిత యాత్రలో బండి సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలన్నీ ఆగిపోతాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. పొరపాటున కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజల బతుకులు బర్బాద్ అవుతాయన్నారు. మన కొండూరు నియోజకవర్గం శంకర పట్నం మండల కేంద్రంలో ప్రజాహిత యాత్రలో బండి మాట్లాడుతూ  ప్రధానమంత్రి మోదీని ముఖ్యమంత్రి కలవడంపై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేయడాన్ని బండి సంజయ్ తప్పు పట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం ప్రధానిని కలిస్తే తప్పేముంది? మోదీని పెద్దన్న అని సంబోధించడంలో తప్పేముంది? దీనిని రాజకీయం చేయడం సిగ్గు చేటు, సీఎం సైతం భవిష్యత్తులోనే కేంద్రంతో సత్సంబధాలు కొనసాగించాలే తప్ప గొడవలు పెట్టుకుంటే నష్టపోయేది ప్రజలేననే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ పొత్తు పెట్టుకుంటాయంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని సంజయ్ కొట్టిపారేశారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్నడూ కలవదు. కాంగ్రెస్, బీజేపీ తూర్పు, పడమర వంటి పార్టీలు రెండు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకుంటాయని బీఆర్ఎస్ నేతలు కారు కూతలు మానుకోవాలి అంటూ చురకలంటించారు. తెలంగాణ నుండి 17కి 17 ఎంపీ సీట్లలో బీజేపీ గెలిపిస్తే.. కేంద్రం నుండి అధిక నిధులు తీసుకొచ్చే బాధ్యత మేం తీసుకుంటాం.

ఈ విషయంలో కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత మాది అని ఉధ్ఘాటించారు. వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందంటూ దుయ్యబట్టారు. హామీల అమలు పేరుతో భారీ ఎత్తున కోతలు పెడుతున్నారంటూ మండిపడ్డారు. ‘‘ కాంగ్రెసోళ్లు బట్టేబాజ్ గాళ్లు... రాష్ట్రం మొత్తం 30 నుండి 40 లక్షల మంది ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నరు. కానీ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మాత్రమే ఇస్తామంటున్నారు. పోనీ అవైనా ఇస్తారా? అంటే అదీ లేదు. కేవలం ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఇండ్ల కోసం రూ.3 వేల కోట్ల నిధులు విడుదల చేశారు.. అంటే 6 వేల మందికి మాత్రమే ఇండ్లు కట్టిస్తారట... అంటే నియోజకవర్గానికి 50 ఇండ్లు మాత్రమే ఇస్తారన్నమాట. ఇంతకంటే మోసం ఇంకోటి ఉందా? వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని దగా చేస్తున్నారు’’అంటూ ధ్వజమెత్తారు.’’ ప్రజాహిత యాత్రలో భాగంగా బండి సంజయ్ కుమార్ ఈరోజు మానకొండూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఉదయం గద్దపాక గ్రామం నుండి మొదలైన యాత్ర మధ్యాహ్నం 3 గంటల వరకు కేశవపట్నం దాకా సాగింది. ప్రజలు యాత్రకు బ్రహ్మరథం పట్టారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా జనం తరలివచ్చి గ్రామగ్రామాన ఘన స్వాగతం పలికారు. ప్రతి గ్రామంలోనూ మహిళలు ఎదురై పూలు చల్లి సంజయ్ తోపాటు అడుగులో అడుగు వేస్తూ పాదయాత్ర చేశారు.

ఈ సందర్భంగా కేశవపట్నంలో మహిళలు ప్రత్యేక డప్పులు వాయిస్తూ.. టపాసులు పేలుస్తూ... బాణాసంచా పేలుస్తూ సంజయ్ ఘన స్వాగతం పలికారు.మీరు ఎంపిగా గెలిపించాకా 150 రోజుల పాటు 1600 కి.మి.తిరిగిన. అయోధ్యలో రాముడి గుడి కడతారని ఎప్పుడైనా అనుకున్నారా? నరేంద్ర మోడీ రాజ్యంలో రాముడు గుడి కట్టించరని తరతరాలు చెప్పుకుంటారు,కేంద్ర నిధులు గురించి చెబుతారు కానీ ఓటు మాత్రం కాంగ్రెస్ కి వేశారు. ఈ సారి మాత్రం అలా చేయకండని కోరారు.

ఉపాధి హామీ పనుల కోసం కేంద్రం 150 కోట్ల 40 లక్షలు ..రోడ్ల కోసం 112 కోట్ల 90 లక్షలు చెట్ల పెంపకం కోసం 131.50 లక్షలు ఇచ్చిందని వెల్లడించారు. మోదీ ఎన్నికలు వచ్చాయి. మీరందరూ ఓటు పువ్వు గుర్తుకు ఓటేయండి. అభివృద్ది పనులకు డబ్బులు ఇచ్చేది నరేంద్ర మోడీ ప్రభుత్వం దీనిని దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలని సూచించారు.మీకోసం కొట్లాడిన  నాపై 100 కేసులు మా కార్యకర్తలపై 10 కేసులకు పైగా ఉన్నాయి. పేదొల్ల కోసం కోట్లాడిన  బీజేపీ కి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు  వేయకుండా .. మీరు మాత్రం కాంగ్రెస్ కి ఓటు వేశారు. ఈసారి అలా చేయవద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా   ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, ఎంపిటిసి అనిల్, నాయకులు రాజిరెడ్డి, సుధగోని శ్రీనివాస్, సాగి భద్ర రావు, చొక్కా రెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు.