నియోజకవర్గ సమగ్ర సమాచారం సిద్ధంగా ఉండాలి : కలెక్టర్
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:సాధారణ పరిశీలకులకు అధికారులుగా నియమించిన వారు అయా నియోజక వర్గాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కలిగి ఏ విషయం అడిగిన తడబాటు లేకుండా సమాధానం చెప్పేలా సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జుక్కల్,. యెల్లారెడ్డి, కామారెడ్డి నియోజక వర్గ ఎన్నికల సాధారణ పరిశీలకులతో పాటు వ్యయ పరిశీలకులు జిల్లాకు రానున్నందున ఆర్ అండ్ బి లో బస ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశీలకులకు మార్గ నిర్దేశకులుగా అన్ని దగ్గరుండి చూసుకోవలసిన భాద్యత లయజన్ అధికారులపై ఉందని అన్నారు. నియోజక వర్గాలకు సంబంధించి రూట్ మ్యాప్, పోలింగ్ బూతుల వివరాలు, అధికారుల ఫోన్ నెంబర్లు తదితర సమగ్ర సమాచారం ఆకళింపు చేసుకొని , పరిశీలకుల సూచనల మేరకు దినచర్య పర్యటనకు సంబంధించి పక్కాగా కార్యాచరణతో ఉండాలని అన్నారు. సిస్టం, ఇంటర్నెట్, ప్రింటర్ తదితర ఎక్విప్మెంట్ తో ప్రతి నియోజక వర్గానికి ఒక సెట్ అప్ ఇక్కడే ఏర్పాటు చేసుకొని బుధవారం నుండే కార్యకలాపాలు నిర్వహించాలని ఆదేశించారు. పరిశిలకులు బసచేసే గదులను పరిశీలించి ఆయా గదులలో టి.వి. ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని, కాలింగ్ బెల్ వచ్చిన వెంటనే వెళ్లే విధంగా ఆఫీస్ సబార్డినేట్ లు అలర్ట్ గా ఉండాలన్నారు. కిచన్, భోజన శాల, కారిడార్ గదులను పరిశీలించి తగు ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.లయజన్ అధికారులు తమ టీమ్ తో సమన్వయంగా ఉంటూ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఒక మహా యజ్ఞంలా నిబద్దతతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి రఘునందన్ , ఆర్ అండ్ బి ఈ ఈ శ్రీనివాస్, తహశీల్ధార్ లత, లయజం అధికారులు తదితరులు పాల్గొన్నారు.