ఎన్నికల పనులు పకడ్బందీగా పూర్తి చేయాలి -కలెక్టర్    

ఎన్నికల పనులు పకడ్బందీగా పూర్తి చేయాలి -కలెక్టర్    

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: ఎన్నికల కమిషన్ నిబంధనలు పకడ్బందీగా పాటిస్తూ సకాలంలో నిర్దేశిత ఎన్నికల పనులు పూర్తి చేయాలని  జిల్లా కలెక్టర్ జితేష్ వి  పాటిల్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవికిరణ్ తో కలిసి జిల్లా కలెక్టర్ లతో ఓటర్ జాబితాలో  ఎఫ్.ఎల్.సి, పి.ఈ.టీ తోలగింపు, ఓటర్ ఎపిక్ కార్డుల జారీ తదితర అంశాల పై ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడారు. జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమించేందుకు ప్రతిపాదనలను ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం, నిర్దేశించిన నమూనా లో మూడు రోజులలో పంపాలని ఆయన తెలిపారు.  జూన్ మాసంలో ఈవిఎం, వివిప్యాట్ల ఎఫ్.ఎల్.సి నిర్వహించాలని,  రాజకీయ పార్టీలకు ముందస్తు సమాచారం అందించి వీడియో రికార్డింగ్ నిర్వహిస్తూ ఎఫ్.ఎల్.సి పూర్తి చేయాలని అన్నారు. ఎఫ్.ఎల్.సి నిర్వహణ అవసరమైన సామాగ్రిని తీసుకునేందుకు ప్రతి జిల్లా నుంచి నోడల్ అధికారి నియమించాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం ఉద్యోగులకు, సిబ్బంది శిక్షణ అందించేందుకు  రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి మాస్టర్ ట్రయినర్ల నియామక ప్రతిపాదనలు ఏప్రిల్ నెలాఖరు వరకు అందించాలని అన్నారు. ఫోటో సిమిలర్ ఎంట్రీ కింద తొలగించిన ఓట్ల వివరాలు,  ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓట్ల వివరాలు మరోసారి పరిశీలన పురోగతిపై జిల్లాల వారీగా ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.  జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రతి వారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించి, మినెట్స్ ను ఆన్ లైన్ లో నమోదు చేయాలని ఆయన సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఏప్రిల్ ఒకటి నాటికి 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పిస్తూ సప్లిమెంటరీ ఓటరు జాబితా విడుదల చేయాలని, జిల్లాలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి ఓటరుగా నమోదు చేయాలని ఆయన తెలిపారు.జిల్లాలో గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ఓటింగ్ తక్కువ నమోదయిన ప్రాంతాల్లో ఓటరు ప్రాముఖ్యత కార్యక్రమాలను వినూత్నంగా నిర్వహించేందుకు ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో స్వీప్ యాక్టివిటిస్ కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన అన్నారు. స్వీప్ యాక్టివిటిస్ నిర్వహణ కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారి నియామకం చేయాలని ఆయన తెలిపారు. 

ఎన్నికల సమయంలో ఎన్నికల వ్యవస్థ పై అనుమానాలు సృష్టించే విధంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు ప్రచారాలు సకాలంలో తిప్పికోట్టె విధంగా జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో సోషల్ మీడియా బృందాలను నియమించాలని అన్నారు. గరుడ యాప్ లో ప్రతి బూత్ స్థాయి అధికారి తప్పనిసరిగా  లాగిన్ అయ్యేలా  ఈ.ఆర్.ఓ లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 7.6 లక్షల ఇండ్లలో 6 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నారని, బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మరో సారి తనిఖీ చేయాలని తెలిపారు.వీడియో సమావేశం అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ ఓటర్ల జాబితా పై పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ ప్రతి శనివారం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించి ఓటరు జాబితాలో వచ్చే మార్పులు, ఎన్నికల కమిషన్ సూచనలు వివరించాలని కలెక్టర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఎన్నికల సూపర్డెంట్ సాయి భుజంగరావు, ఎన్నికల అధికారులు శ్రావణి, ఇందిరా ప్రియదర్శిని పాల్గొన్నారు.