కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటికొస్తారు!
- రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారు
- తెలంగాణ టీడీపీ నేతలు
- ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల దీక్ష
ముద్ర, తెలంగాణ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్కు నిరసనగా సోమవారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నిరాహార దీక్ష చేశారు. ఈ దీక్షలో ఎన్టీఆర్ కుమార్తె గారపాటి లోకేశ్వరి, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, గారపాటి శ్రీనివాస్, చలసాని చాముండేశ్వరి, నారా రోహిత్ తల్లి ఇందిర, తారకరత్న సతీమణి అలేఖ్యరెడ్డి, నందమూరి జయశ్రీ, సుధ, శిల్ప, దీక్షిత, రాహుల్, తారకరత్న కుమార్తె నిష్క తదితరులు పాల్గొన్నారు. టీడీపీ మాజీ ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్ కూడా ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు కు సంఘీభావంగా నిరాహారదీక్షలో పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, పార్టీ లీడర్అరవింద్ కుమార్ గౌడ్ తదితరులు దీక్షలో పాల్గొని చంద్రబాబుకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం రాజకీయ కక్షతోనే చంద్రబాబును కేసులో ఇరికించారని మండిపడ్డారు. ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అంటూ నినాదాలు చేశారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని, ఈ కేసుల నుంచి కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలకు నిరంతరం సేవ చేయాలన్న తపన, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యమే తప్ప చంద్రబాబుకు మరో ఆలోచన లేదన్నారు. మరోవైపు ఎన్టీఆర్ ఘాట్లో దీక్ష చేపట్టిన నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఈ సందర్భంగా సుహాసిని డిమాండ్ చేశారు.