ఘోర రోడ్డు ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం
  • ద్విచక్ర వాహనంపై బోల్తాపడ్డ టిప్పర్
  • అక్కడికక్కడే ముగ్గురు మృతి 

ముద్ర, హుజురాబాద్:-బోర్ల పెళ్లిలో జరిగిన పెద్దమ్మ తల్లి జాతరకు వెళ్లి తిరుగు ప్రయాణం అవుతున్న తరుణంలో మొరం టిప్పర్ లారీ ఆగి ఉన్న ద్విచక్ర వాహనంపై బోల్తాపడడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో గంట విజయ్ (17), గంట వర్ష (15), సింధూజ (18)లు మృత్యువాత పడ్డారు. బోర్నపల్లి పెద్దమ్మ జాతరలో పాల్గొని బైక్ పై తిరుగు ప్రయాణం అయిన వీరు బొడ్రాయి సమీపంలోని మూల మలుపు వద్దకు చేరుకోగానే ఆగిపోయారు.

అటు వైపుగా వస్తున్న మొరం లారీని చూసి వెళ్లిన తర్వాత ముందుకు వెళ్లాలన్న ఉద్ధేశ్యంతో క్రాసింగ్ వద్ద ఆగారు. సైదాపూర్ మండలం గొడిశాల మీదుగా సాగుతున్న నేషనల్ హైవే నిర్మాణం కోసం మొరం తరలిస్తున్న టిప్పర్ అదుపుతప్పి వారిపైనే బోల్తాపడింది. ఈ ప్రమాదంలో విజయ్, వర్ష, సింధూజలపై మొరం పడడంతో చిక్కుకపోయి అక్కడిక్కడ చనిపోయారు.ఈ ప్రమాదంలో అన్నా చెల్లెల్లు విజయ్, వర్షలు చనిపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. టిప్పర్ బోల్తా పడడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.