ఫర్నీచర్ అప్పగించాలంటూ జగన్ కు జీఏడీ లేఖ

ఫర్నీచర్ అప్పగించాలంటూ జగన్ కు జీఏడీ లేఖ

అమరావతి, ముద్ర వార్తలు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఇంట్లోవున్న ప్రభుత్వ ఫర్నీచర్ ను వెంటనే అప్పగించాలని కోరుతూ రాష్ట్ర సచివాలయ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ (జీఏడీ) ఒక లేఖను రాసినట్టు సమాచారం. సాధారణంగా ఎన్నికలలో ఓటమి పాలైన తర్వాత నాయకులెవరైనా తాము వినియోగిస్తున్న ప్రభుత్వ ఫర్నీచర్ ను ఫలితాల తర్వాత 15 రోజులలోగా వెనక్కి ఇవ్వాల్సివుంది. దీంతో జగన్ వద్ద వున్న ప్రభుత్వ వస్తువులన్నింటినీ పేర్కొంటూ సచివాలయ జీఏడీ ఆయనకు లేఖ రాసింది. ఈనెల 4న ఎన్నికల ఫలితాలు రాగా, ఈ రోజుతో పదిహేను రోజుల గడువు పూర్తవుతుంది. అయితే, ఇప్పటిదాకా మాజీ ముఖ్యమంత్రి జగన్ నుంచి ఫర్నీచర్ అప్పగింతకు సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో జీఏడీ చివరికి లేఖ రాసినట్టు సమాచారం.

సీఎంవోలో ఉన్న కంప్యూటర్లు, వీడియో కాన్ఫరెన్స్ సిస్టం, ఇతర ఫర్నీచర్‌ను ఇన్వెంటరీ జాబితా ప్రకారం తమకు పంపాలని లేఖలో పేర్కొన్నారు.  జగన్ నివాసంలో ఉన్న ప్రభుత్వ ఫర్నిచర్‌పై సోషల్ మీడియాలో ఇప్పటికే బాగా రచ్చ జరుగుతోంది. గతంలో ఇదే విషయంలో దివంగత టీడీపీ నేత కోడెల శివప్రసాద్‌ను హింసించి ఆయన ఆత్మహత్యకు కారణమయ్యారని, అలాంటిది ఇప్పుడు స్వయంగా జగనే ప్రభుత్వ ఫర్నిచర్‌ను ఎలా ఉంచుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత అప్పిరెడ్డి స్పందిస్తూ.. తమ వద్దనున్న ఫర్నీచర్‌కు లెక్క కడితే డబ్బులు చెల్లిస్తామని పేర్కొన్నారు. అప్పిరెడ్డి స్పందనను ప్రభుత్వం లెక్కలోకి తీసుకోలేదు.