ఫుడ్ పాయిజన్ తో అంగన్వాడి విద్యార్థుల అస్వస్థత
- ఒకరి పరిస్థితి విషమం
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
- మెరుగైన చికిత్సకు హనుమకొండకు తరలింపు
- అంగన్వాడీ టీచర్ ఆయాకు షోకాజ్ నోటీస్
- విచారణలో తేలితే కఠిన చర్యలు సిడిపిఓ
గూడూరు, ఫిబ్రవరి 1(ముద్ర): అంగన్వాడి సిబ్బంది నిర్లక్ష్యం చిన్నారుల పాలిట శాపంగా మారింది. ఏకంగా విద్యార్థులను పట్టించుకోని అంగన్వాడి టీచర్ల వల్ల చిన్నారులు బయటకు వెళ్లి అస్వస్థతకు గురవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లైన్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని స్థానిక అంగన్వాడీ సెంటర్ కు చెందిన 4 గురు విద్యార్థులకు పుడ్ పాయిజన్ కావడం తో విద్యార్థులను గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటన మంగళవారం జరగగా ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది 4 గురు విద్యార్థులలో ముగ్గురు విద్యార్థులు క్షేమంగానే ఉన్నారు.
కానీ ఒక విద్యార్థి భూక్య జశ్వంత్ (4) పరిస్థితి విషమంగా ఉండడంతో విద్యార్ధి తల్లితండ్రులు హన్మకొండ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంగన్వాడీ పాఠశాల అవరణ లో మధ్యాహ్నం భోజనం అనంతరం పిల్లలు ఆడుకుంటూ పక్కనే ఉన్న పంట క్షేత్రాల్లో ఉన్న యూరియా ను చెక్కర అనుకొని తీసుకొన్నట్లు అంగన్వాడి టీచర్స్ చెప్తున్నారు విధుల్లో ఉండాల్సిన ఉపాధ్యాయులు నిర్లక్ష్యంతో ఉండటంతోనే ఈ సంఘటన జరిగింది అంటూ విద్యార్థుల తల్లి తండ్రులు అంగన్వాడి టీచర్ అంగన్వాడి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సిడిపిఓ నిలోఫర్ అజ్మీ అంగన్వాడీ కేంద్రాన్నితనిఖీ చేసి విచారణ జరుపుతున్నారు. కాగా ఈ ఘటన వల్ల అంగన్వాడి సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే జరిగిందని ఆరోపణలతో అంగన్వాడీ టీచర్ కు మరియు ఆయాకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. విచారణలో అంగన్వాడి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే జరిగిందని తేలితే చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరించారు.