భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది

భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది

లండన్‌లోని కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీ వేదికగా భారత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్‌  అగ్రనేత రాహుల్‌ గాంధీ. భారత ప్రజాస్వామ్య మూల స్వరూపం ప్రమాదంలో పడిందని ధ్వజమెత్తారు. తనపై నిఘా పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పెగాసస్‌ ఉపయోగించిందని దుయ్యబట్టారు.  లండన్‌ పర్యటనలో ఉన్న రాహుల్‌  కేంబ్రిడ్జ్‌  యూనివర్శిటీలో ఎంబీఏ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. '21వ శతాబ్దంలో లెర్నింగ్‌ టు లిజన్‌' అనే అంశంపై మాట్లాడిన ఆయన.. నరేంద్రమోదీ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ''నా ఫోన్లోకి పెగాసస్‌ జొప్పించారు. చాలా మంది రాజకీయ నాయకుల ఫోన్లపైనా ఇలాగే నిగా పెట్టారు. దీనిపై కొందరు ఇంటెలిజెన్స్‌ అధికారులు నాకు కాల్‌ చేసి.. 'మీరు ఫోన్లో మాట్లాడేప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండండి. మీ మాటలను రికార్డ్‌ చేస్తున్నాం' అని హెచ్చరించారు. గత కొన్నేళ్లుగా మేం ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాం. ఇక ప్రతిపక్షాలపైన కేసులు సరేసరి. క్రిమినల్‌ చట్టాల పరిధిలోకి రాని ఎన్నో అంశాల ఆధారంగా నాపైనా కేసులు పెడుతున్నారు'' అని మోదీ సర్కారుపై రాహుల్‌ మండిపడ్డారు.

''భారత ప్రజాస్వామ్యం ఒత్తిడిలో ఉందని, దానిపై దాడి జరుగుతోందని అందరికీ తెలుసు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాల్లాంటి పార్లమెంట్‌, స్వేచ్ఛాయుత మీడియా, న్యాయవ్యవస్థ టి వాటిని నిర్బంధిస్తున్నారు. దీంతో ప్రజాస్వామ్య మూల స్వరూపం ప్రమాదంలో పడుతోంది'' అని రాహుల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమీపంలో పోలీసులు తనను అరెస్టు చేసినప్పటి ఓ ఫొటోను ప్రదర్శించిన రాహుల్‌.. కేంద్రంపై ధ్వజమెత్తారు. ''పార్లమెంట్‌ హౌజ్‌ ముందు ప్రతిపక్ష నేతలంతా నిలబడి ఏదో ఒక విషయంపై చర్చించినందుకు వారందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. కొన్ని హింసాత్మకంగా మారుతున్నాయి కూడా'' అని రాహుల్‌ దుయ్యబట్టారు.  వారం రోజుల పర్యటన నిమిత్తం రాహుల్‌ ఇటీవల లండన్‌ వెళ్లారు. కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీలో ఆయన బిగ్‌ డేటా, భారత్‌-చైనా సంబంధాలపైనా ప్రసంగాలు చేయనున్నారు. వారాంతంలో ప్రవాస భారతీయుల సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు. డియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి నిర్వహించనున్నారు.