ఇజ్రాయెల్–హమాస్
- 2500 మంది మృతి
- ఏ ఒక్కరినీ వదలమన్న హమాస్ కమాండర్ మహమ్మద్ అల్ జహర్
- కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తామన్న నెతన్యాహు
- హమాస్కు సహకరిస్తామన్న ఇరాన్
- రంగంలోకి దిగుతామన్న అమెరికా
- శాంతించాలన్న ఐరాస
- పట్టించుకోని ఇరుదేశాలు
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్–హమాస్ దాడుల్లో ఇప్పటివరకూ ఇరువైపులా 2500 ప్రాణాలు కోల్పోయారు. ఐదురోజులుగా ఇజ్రాయెల్ హమాస్పై రోజురోజుకు దాడులను తీవ్రతరం చేస్తోంది. దీంతో గాజాపట్టి పూర్తిగా భస్మిపటలాన్ని తలపిస్తోంది. బందీలను సురక్షితంగా విడిచేవరకు గాజకు విద్యుత్, నీరు అందించేది లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. వారికేమైనా జరిగితే పరిస్థితులు మరింత భీకరంగా ఉంటాయని హెచ్చరించింది. ఇంకోవైపు హమాస్ కమాండర్ మహమ్మద్ అల్ జహర్ నేరుగా ఇజ్రాయెల్ ప్రధానికి హెచ్చరికలు చేశారు. ఏ ఒక్కరినీ వదలబోమన్నారు. ఇజ్రాయెల్ తమ మొదటి లక్ష్యమన్నారు. పూర్తి ప్రపంచదేశాలు తమ చట్టమే రానుందని హెచ్చరించారు. ఈ వీడియోపై నెతన్యాహు స్పందిస్తూ ప్రతీఒక్క హమాస్ ఉగ్రవాదిని మట్టుబెట్టేవరకూ ఊరుకోబోమన్నారు. ఈ ఉగ్రవాద సంస్థను కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తామన్నారు.
మరోవైపు లెబనాన్ కూడా ఇజ్రాయెల్పై దాడులకు పాల్పడుతుండగా, ఇజ్రాయెల్ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. మరోవైపు అరబ్ దేశాలు శాంతిసంధి కోసం ప్రయత్నాలను ముమ్మరం చేసే దిశగా చర్యలు తీసుకుంటుంటే ఇంకోవైపు ఇరాన్ హమాస్కు పూర్తిగా సహకరిస్తామని హమాస్ను రక్షించుకునేందుకు అవసరం అయితే తాము కూడా ఇజ్రాయెల్పై దాడులకు వెనుకాడబోమన్నారు. ఈ ప్రకటనతో అమెరికా జోబైడెన్ రంగంలోకి దిగారు. ఒకవేళ ఇరాన్ రంగంలోకి దిగితే తాము సిద్ధంగానే ఉన్నామన్నారు. ఇరుదేశాల మధ్య మూడోదేశం యుద్ధానికి ప్రయత్నిస్తే తాము రంగంలోకి దిగక తప్పదని బైడెన్ హెచ్చరించారు. ఇరుదేశాల యుద్ధం మధ్య అనేకమంది అమాయకుల ప్రాణాలకు సంకటంగా మారాయి. నీరు, తిండిలేక సామాన్యులు అల్లాడుతున్నారు. ఇదే విషయంపై ఐక్యరాజ్యసమితి ఇజ్రాయెల్–హమాస్లో శాంతి నెలకొల్పేందుకు ముందుకు రావాలని సూచించింది. ఐరాస శాంతి చర్యలపై ప్రస్తుతానికి ఏ దేశం ముందుకు రాకపోవడం గమనార్హం.
మరోవైపు అమెరికా, జర్మనీ నుంచి భారీ ఎత్తున ఇజ్రాయెల్కు ఆయుధ సంపత్తి అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గాజా సరిహద్దు వద్ద ఇజ్రాయెల్ మూడు లక్షల మంది భూతల ఆర్మీని రంగంలోకి దింపి గాజాపట్టి, హమాస్ను పూర్తిగా భూ స్థాపితం చేయాలని ప్రయత్నిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే నెతన్యాహు అన్నట్లుగా మిడిల్ ఈస్ట్ ను ఇజ్రాయెల్ పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటుంది.
ఆపరేషన్ విజయ్..
మరోవైపు ఇజ్రాయెల్లో చిక్కుకున్న 18వేల మంది భారతీయుల కోసం భారత విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది. ఆ శాఖ మంత్రి జయశంకర్ యూఏఈ (యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్), ఇజ్రాయెల్ ఇతర దేశాలతో చర్చించి భారతీయులను సురక్షితంగా రప్పించేందుకు సహకరించాలని కోరారు. ఈ చర్చలు ఫలప్రదమయ్యాయి. దీంతో గురువారం రాత్రి 230 మంది భారతీయులను మొదటివిడతగా తీసుకువస్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది.