వచ్చేది మళ్లీ మోదీ సర్కారే...కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి
- తెలంగాణ బీజేపీదే: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి
- కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే
- అందుకే బీఆర్ఎస్ అవినీతి పై కాంగ్రెస్ వెనకడుగు వేస్తున్నది
- బీఆర్ఎస్కు ఓటు వేస్తే మూసీలో వేసినట్టే
- ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పనిచేస్తలేదు
- బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం
- ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి
- నా బూత్లో నేను గెల్వాలి అనేలా పనిచేయండి
- రైతులు, రైతు కూలీలు,యువత మహిళలను చైతన్య పరచండి
- చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక మీటింగ్లో బీజేపీ స్టేట్చీఫ్ దిశా నిర్దేశం
ముద్ర,హైదరాబాద్: కేంద్రంలో వచ్చేది మళ్లీ మోదీ ప్రభుత్వమేనని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలోనూ బీజేపీ వేవ్ ఉన్నదని ఆయన వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల కోసం బూత్ స్థాయి నుంచే పక్కా ప్రణాళికతో పనిచేసి మెజార్టీ సీట్లు సాధించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం కిషన్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి హాజరై మాట్లాడారు.
ఆ రెండు పార్టీలతో ఒరిగేదేం లేదు..
ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీదేనని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కుటుంబ పార్టీల డీఎన్ఏ ఒక్కటే. బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ సర్కారు వెనకడుగు వేస్తుండటాన్ని చూస్తే.. ఈ రెండు పార్టీలు ఒకటేనన్న విషయం స్పష్టమవుతున్నది. కాళేశ్వరంపై దర్యాప్తునకు మేము సిద్ధమే అని సీబీఐ చెబుతున్నా.. కాంగ్రెస్ సర్కారు సీబీఐ విచారణకు ఆదేశిస్తలేదు. బీఆర్ఎస్ అవినీతిని ఆ పార్టీ కప్పిపుచ్చాలని చూస్తున్నది. బీఆర్ఎస్కు ఓటు వేస్తే మూసీలో వేసినట్టే. ఆ పార్టీకి ఓటు వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉన్నది. ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పనిచేస్తలేదు. దీనిపై ప్రజలకు వివరించాలి”అని సూచించారు.
బూత్ స్థాయి నుంచే..
‘‘బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం. గత తొమ్మిదిన్నరేండ్లలో లక్షల కోట్ల నిధులు మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చింది. జాతీయ రహదారులు, రైల్వేలు, ఇతర ప్రాజెక్టులు సహా ట్రైబల్ వర్సిటీ, పసుపుబోర్డు, వందే భారత్ రైళ్లు, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ ఇలా.. పెద్ద ఎత్తున తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నది. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నా బూత్లో నేను గెల్వాలి అనేలా ప్రతి కార్యకర్త పనిచేయాలి. రైతులు, రైతు కూలీలు,యువత, మహిళలను చైతన్య పరచండి. కేంద్రంలో రాబోయేది మోదీ ప్రభుత్వమే. రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లను సాధించడం ద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ గెలుపు కోసం సమన్వయం చేసుకుంటూ పనిచేయాలి”అని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. గచ్చిబౌలిలో జరిగిన ఈ సమావేశానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అధ్యక్షత వహించారు. చేవెళ్ల ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ మీటింగ్కు పెద్ద ఎత్తున హాజరయ్యారు.