మోదీ వెంటనే దిగిపోవాలి
హైదరాబాద్: పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని ఎంజీ రోడ్డులో గల గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. గ్యాస్ సిలెండర్లతో నిరసన, ధర్నా చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహిళల ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ ధరలు తక్కువగా ఉన్నాయని తెలిపారు.
మోదీ ఎన్నికల సందర్భంగా గ్యాస్కు దండం పెట్టి ఓటు వేయాలని చెప్పారని... కానీ ఇప్పుడు ధరలు రూ.1100 దాటిందన్నారు. కేంద్ర ఫ్లైట్ చార్జీలు తగ్గించిందని, విమానాల్లో పేదలు వెళ్తారా అని మంత్రి ప్రశ్నించారు. ప్రతి బడ్జెట్ తర్వత గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం గ్యాస్ ధరలు రూ.50 పెంచడంతో... ఇప్పుడు రూ.1155కు చేరిందన్నారు.