రాహుల్ ను ప్రధానిని చేయాలని పాకిస్థాన్ తహతహ

రాహుల్ ను ప్రధానిని చేయాలని పాకిస్థాన్ తహతహ
  • గుజరాత్ ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రదాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో కాంగ్రెస్ బలహీనపడుతోందని, ఈ పరిణామాన్ని పాకిస్థాన్ తట్టుకోలేకపోతోందని అన్నారు. కాంగ్రెస్ ఇక్కడ చచ్చిపోతోందని అక్కడ పాకిస్థాన్ ఏడుస్తోందని, ఇప్పుడు పాక్ నేతలు కాంగ్రెస్ కోసం ప్రార్థించాలి అని ఆయన పేర్కొన్నారు. లోక్ సభ మూడోదశ ఎన్నికలక ముందు గుజరాత్ లోని ఆనంద్ నగర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. గత 60 ఏళ్లుగా కాంగ్రెస్ దేశంలోని బ్యాంకులను లూటీ చేసిందని ఆయన ఆరోపించారు. మోదీ రాకముందు ఈ దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు ఉండేవారని అన్నారు. కాశ్మీర్ లో భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కాంగ్రెస్ అంగీకరించలేదని అన్నారు. ఆర్టికల్ 370 గోడలా అడ్డుకుందని తెలిపారు. ఉక్కుమనిషి సర్దార్ పటేల్ భూమి నుంచి వచ్చిన నేను ఆర్టికల్ 370ను రద్దు చేసి, కాశ్మీర్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి భారత రాజ్యాంగాన్ని అక్కడ అమలు చేశామని తెలిపారు. యువరాజు (రాహుల్ గాంధీ)ని ప్రధానిని చేయడానికి పాకిస్థాన్ ఉవ్విళ్లూరుతోందని, పాకిస్థాన్ కు, కాంగ్రెస్ కు మధ్య ఉన్న బంధం ఇప్పుడు బహిర్గతమయ్యిందని ప్రదాని మోదీ వ్యాఖ్యానించారు.