సభలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతులు తప్పనిసరి
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం
ముద్ర ప్రతినిధి, జనగామ : ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ముందస్తు అనుమతులు లేకుండా ఏమైనా కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలతో పాటు వాహనదారులను ఇబ్బందులకు గురిచేసే విధంగా ఎవరైనా ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహిస్తే వారిపై కేసులను నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ధర్నాలు, నిరసనలకు ముందస్తుగా పర్మిషన్ తీసుకోవడమే కాకుండా తలపెట్టిన కార్యానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని పొందు పరచాల్సి ఉంటుందని డీసీపీ పేర్కొన్నారు. డిజేలు, బాణాసంచా కాల్చడానికి కూడా అనుమతులు తప్పనిసరి అన్నారు. ఈ నిబంధనలను ఎవరు ఉల్లంఘించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.