సిద్ధిపేట మున్సిపాలిటీ పనితీరును పరిశీలించిన తమిళనాడు నేతలు

సిద్ధిపేట మున్సిపాలిటీ పనితీరును పరిశీలించిన తమిళనాడు నేతలు
  • సిద్దిపేట స్వచ్ఛ ప్రగతిని మెచ్చుకున్న
  •  తిరుచురాపల్లి మున్సిపల్ కౌన్సిల్

 ముద్ర ప్రతినిధి, సిద్ధిపేట: తడి, పొడి, హానికరమైన చెత్తను వేర్వేరుగా చేయడం. ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణ, సిద్ధిపేట మున్సిపాలిటీ పరిపాలనలో స్టీల్ బ్యాంకు అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు, సంస్కరణలు అద్భుతంగా ఉన్నాయని తమిళనాడు రాష్ట్రానికి చెందిన తిరుచిరావుపల్లి(త్రిచి) మున్సిపాలిటీ కార్పోరేషన్ కౌన్సిల్ పాలకవర్గము ప్రశంసించింది. సిద్ధిపేట మున్సిపాలిటీ అభివృద్ధి గురించి విన్నాం.క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజల్లో అవగాహన కల్పించి ఏలా మార్పు తెచ్చారో తెలుసుకుని ఎంతో నేర్చుకున్నాం.మా తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరావుపల్లి మున్సిపాలిటీ కార్పోరేషన్ లో అమలు చేస్తామని ధీమాగా కౌన్సిల్, అధికారుల బృందం చెప్పింది.

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మున్సిపాలిటీ సందర్శన రెండు రోజుల పర్యటనలో భాగంగా తమిళనాడు లోని తిరుచురావుపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్, అధికారుల బృందం మంగళవారం సిద్దిపేటకు విచ్చేసి మంత్రి హరీశ్ రావుతో పట్టణ శివారులోని హరిత హోటల్ లో  భేటీ అయ్యారు.ఈ మేరకు తమిళనాడు రాష్ట్రంలోని 4వ పెద్ద నగరం 15 లక్షల పైచిలుకు జనాభా కలిగిన  మున్సిపాలిటీ కార్పోరేషన్ తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట మున్సిపాలిటీని సందర్శించడం గర్వించదగ్గ విషయమని చెప్పారు. నిత్యం తడి, పొడి, హానికరమైన చెత్త వేర్వేరుగా చేసి ఇచ్చే సిద్ధిపేట ప్రజల విజయంగా చెప్పుకొచ్చారు.  సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ, 24వ వార్డుల్లో తడి, పొడి, హానికరమైన చెత్త వేర్వేరుగా ప్రజలు ఇస్తున్న తీరును త్రిచి మున్సిపల్ బృందం ఇంటింటా తిరిగి పరిశీలించింది.పలు గృహాల్లోని గృహిణులతో మాటామంతి కలిపి తడి,పొడి చెత్త వేర్వేరుగా చేసి ఇవ్వడం మీకెలా సాధ్యమైందని ప్రజలను ఆరా తీశారు. 

24వ వార్డులో స్టీల్ బ్యాంకు చూసి త్రిచి మున్సిపాలిటీ బృందం ఆశ్చర్య పడింది.
అనంతరం బుస్సాపూర్ డంప్ యార్డు కు వెళ్లి  అక్కడ ప్రతీ యూనిట్ గురించి ఆరా తీస్తూ యార్డు మొత్తం కలియ తిరిగారు. 
అనంతరం పట్టణంలోని స్వచ్ఛబడిలో అడుగడుగునా ఆరా తీస్తూ దాదాపు ప్రతీ అంశంపై క్లుప్తంగా అడిగి తెలుసుకున్నారు.
 సిద్ధిపేట శివారులోని హరిత హోటల్ లో మంత్రి హరీశ్ రావుతో కలిసి లంచ్ చేశారు.

అనంతరం డీఆర్సీసీ కేంద్రాన్ని, ఆ తర్వాత సిద్ధిపేట ప్రభుత్వ దవాఖానను సందర్శించారు. ఆరోగ్య శాఖలో తెచ్చిన సమూల మార్పులు తెలుసుకుని హర్షం వ్యక్తం చేస్తూ ఓ గర్భిణీకి కేసీఆర్ కిట్ అందించారు. అనంతరం కోమటి చెరువులో ఆహ్లాదకరమైన వాతావరణంలో బోటింగ్ చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సంస్కృతి బతుకమ్మలు పేర్చి బతుకమ్మ ఆట పాటలు ఆడిపాడారు. ఈ మేరకు ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణ, పరిపాలన రంగంలో సిద్ధిపేట మున్సిపాలిటీ అమలు చేస్తున్న పలు విధి, విధానాలను ప్రశంసించారు.ప్రధానంగా బుస్సాపూర్ లో శాస్త్రీయ పద్దతిలో డంప్ యార్డ్ నిర్వహణ, వ్యర్థాల నుండి సీఏన్జీ గ్యాస్, భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లు, హానికరమైన చెత్తను దహనం ఇన్సినరేటర్ వినియోగం, దేశానికే రోల్ మోడల్ గా నిలిచిన స్వచ్ఛబడిని సందర్శించి మంత్రముగ్ధులయ్యారుసిద్ధిపేట మున్సిపాలిటీలో అమలవుతున్న కార్యక్రమాలను తమిళనాడు రాష్ట్రంలోని త్రిచి మున్సిపల్ కార్పోరేషన్ లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని త్రిచి మున్సిపల్ కార్పోరేషన్ బృందం తెలిపింది.

సిద్ధిపేటలో ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి హరీశ్ రావు మంచి విజన్ ఉన్న నాయకుడని, సిద్ధిపేట మున్సిపల్ రంగంలో ఎన్నో సంస్కరణలు, వినూత్న కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేశారని క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైందని బృందం తెలిపింది.ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్ధిపేట మున్సిపాలిటీ తరహాలో త్రిచి అభివృద్ధి జరిగేలా తమిళనాడు రాష్ట్ర మున్సిపల్ మంత్రి కే.ఎన్. నెరు, విద్యాశాఖ మంత్రి అబిల్ మగేష్, త్రిచి మేయర్ అన్ బలగన్, కమిషనర్-ఐఏఎస్ వైద్య నాథన్ లకు తెలిపి వారికి సహకరిస్తున్న ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. 

వీటిలో ప్రధానంగా ఇంటింటికి తడి,పొడి చెత్త వేర్వేరుగా సేకరణకై ప్రజలను చైతన్యం చేసిన తీరును మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు వివరించారు.సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో శాస్త్రీయ పద్దతుల అమలు, వేస్ట్ టూ వెల్త్, నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ల ఏర్పాటు, ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యూటేషన్, ఆస్తిపన్ను మదింపు, పట్టణ ప్రగతి తదితర ఎన్నో వినూత్న పథకాలు అమలు చేస్తున్నామని సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ కడవెరుగు మంజులరాజనర్సు తమిళనాడు త్రిచి మున్సిపాలిటీ బృందానికి వివరించారు. ఈ సందర్శనలో డిప్యూటీ మేయర్ దివ్య ధనకొడి, మూడు జోనల్ చైర్మన్లు జయ నిర్మల, దుర్గాదేవి, విజయలక్ష్మి, మాజీ మేయర్ సుజాత, శానిటరీ ఆఫీసర్ కార్తికేయ, త్రిచి మున్సిపల్ అధికారులు,సిబ్బంది, సమన్వయ కర్త సునీత, పర్యావరణ ప్రేమికురాలు డాక్టర్ శాంతి,సిద్ధిపేట మున్సిపల్ కౌన్సిలర్లు దీప్తి నాగరాజు, సిద్దిపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కే మల్లికార్జున్ రెడ్డి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.