ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలి 

ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలి 
  • ప్రతి జిల్లాలో ఫిర్యాదుల పరిష్కారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
  • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: భారత ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని, దీనిని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర  ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఇతర  రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి,  అదనపు కలెక్టర్ లు  జే.అరుణ శ్రీ, శ్యాం ప్రసాద్ లాల్ లతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు. 

రాష్ట్ర  ప్రధాన ఎన్నికల అధికారి  వికాస్ రాజ్ మాట్లాడుతూ,  భారత ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2023 కు షెడ్యూల్ విడుదల చేసిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని, 24 గంటల వ్యవధిలో ప్రతి ప్రభుత్వ  భవనాలలో వివిధ రాజకీయ పార్టీలకు, నాయకులకు సంబంధించిన హోర్డింగులు, నాయకుల ఫోటోలు, వాల్ రైటింగ్స్  తొలగించాలని, 48 గంటల వ్యవధిలో పబ్లిక్ ప్రాపర్టీస్ వద్ద హోర్డింగులు, ఫ్లెక్సీలు ఫోటోలు తొలగించాలని, ప్రైవేట్ స్థలాలో ఉన్న హోర్డింగులు, ఫ్లెక్సీలు, ఫోటోలను 72 గంటల్లో తొలగించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల వెబ్ సైట్, జిల్లా వెబ్ సైట్ లలో మంత్రుల ఫోటోలు, ముఖ్యమంత్రి ఫోటో లను తొలగించాలని అన్నారు. రాజకీయ పార్టీలు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలకు ర్యాలీలు, సభల నిర్వహణకు అనుమతులు నిబంధనల ప్రకారం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలో జారీ చేయాలని ఆయన సూచించారు. నవంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని, అప్పటి వరకు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు,  కంట్రోల్ రూమ్ ఏర్పాటు, మీడియా సెంటర్ ఏర్పాటు, ఎన్నికల విధుల నిర్వహణకు సిబ్బంది శిక్షణ, తదితర కార్యక్రమాలు పూర్తి చేయాలని,  సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ వివరాలు సమర్పించాలన్నారు. 

రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సంబంధించిన ప్రకటనలకు అనుమతి అదే రోజు అందించే విధంగా ఎంసిఎంసి పని చేయాలని అన్నారు. శాంతి భద్రతలు కట్టుదిట్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.  ఎన్నికలకు సంబంధించి రిపోర్ట్ లు ప్రతి రోజూ సమర్పించే విధంగా జిల్లాలో వ్యవస్థ ఏర్పాటు చేయాలన, జిల్లాలో దివ్యాంగుల ఓటర్లను పోలింగ్ కేంద్రాల వారిగా మ్యాపింగ్ చేసుకోవాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఇతర ఎన్నికల నిర్వహణకు సంబంధించిన  ఫిర్యాదులు సేకరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో త్రాగునీరు, లైటింగ్, ర్యాంపు, నీటి సరఫరాతో కూడిన టాయిలెట్లు మొదలగు మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మోడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని, నామినేషన్లు స్వీకరించే సమయంలో రిటర్నింగ్ అధికారులకు భద్రత ఏర్పాటు చేయాలని, అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించే సమయంలో నిబంధనలు పాటిస్తూ నామినేషన్ లో అన్ని అంశాలు నింపారో లేదో చెక్ చేసుకోవాలని, నింపని పక్షంలో సదరు అభ్యర్థులకు రాత పూర్వకంగా సమాచారం అందించాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ప్రతినిధులు ప్రభుత్వ మిషనరీ ఎన్నికల కోసం వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని, ఓటింగ్ స్లిప్పుల పంపిణీ నామినేషన్ల ముగింపు తేది అనంతరం నుంచి చేపట్టాలని అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి సి విజల్ లాగిన్ యాక్టివ్ కాలేదని, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రిటర్నింగ్ అధికారి పోర్టల్ లో పెండింగ్ ఫారంలు కనపడటం లేదని, వీటిని పరిష్కరించాలని కోరారు.  ఈ వీడియో సమావేశంలో డి.సి.పి. వైభవ్ గైక్వాడ్, రెవెన్యూ డివిజన్ అధికారులు మధుమోహన్, హనుమా నాయక్,  ఏ.సి.పి. ఎడ్ల మహేష్, పోలీస్ అధికారులు, కలెక్టరేట్ ఏ. ఓ. శ్రీనివాస్, సి విభాగం సూపరిండెంట్ ప్రకాష్, ఎన్నికల డిప్యూటీ తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.