వివాహానికి కొద్ది గంటల ముందే వరుడు మృతి..!

వివాహానికి కొద్ది గంటల ముందే వరుడు మృతి..!

మహబూబాబాద్, ముద్ర ప్రతినిధి: మరో కొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు విద్యుదాఘాతంతో దుర్మరణం పాలైన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెం గ్రామంలో గురువారం జరిగింది. కొమ్ముగూడెం గ్రామానికి చెందిన భూక్య యాకూబ్ అనే యువకుడికి శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు గార్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో వివాహం జరగాల్సి ఉంది.

గురువారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో యాకూబ్ తన ఇంట్లో విద్యుత్ మోటార్ కు మరమ్మతు చేసి విద్యుత్ కనెక్షన్ ఇస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురికాగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ దుర్ఘటనతో అప్పటివరకు బంధుమిత్రుల పెళ్లి సందడితో కళకళలాడిన ఇల్లు వరుడు యాకూబ్ విగత జీవిగా మారడంతో శోకసంద్రంలో మునిగింది. కొద్ది గంటల్లో పెళ్లి బాజా మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగించాల్సి రావడంతో కొమ్ముగూడెంలో తీవ్ర విషాదం నెలకొంది.