టికెట్ ఎవరికి?

టికెట్ ఎవరికి?
  • హస్తంలో కీలక దశకు చేరుకున్న టికెట్ల వ్యవహారం
  • ఏఐసీసీ స్ర్కీనింగ్ కమిటీ భేటీ
  • నేడు మరోసారి చర్చించనున్న కమిటీ
  • ఈ నెలాఖరు నుంచి వరుసగా జాబితా విడుదల
  • ఇప్పటికే ఢిల్లీకి చేరిన ఆశావహులు
  • తొలి జాబితాలో 35 మంది
  • తుక్కుగూడ సభ తర్వాత మరింత పెరిగిన ప్రయారిటీ

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపులు కీలక దశకు చేరుకున్నాయి. ఈ నెలాఖరు వరకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంట్లో భాగంగా రాష్ట్రం నుంచి పంపించిన జాబితాపై ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ రెండు రోజులు చర్చిస్తున్నది. బుధవారం రాత్రి సమావేశమైన పీఈసీ.. గురువారం మరోసారి సమావేశం కానున్నది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించే ఈ భేటీలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు బాబా సిద్ధిఖీ, జిగ్నేశ్​ మేవాని, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్​కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్ రావు ఠాక్రే తదితరులు హాజరుకానున్నారు.

తుక్కుగూడ సభ తర్వాత జోష్​

కాంగ్రెస్​పార్టీ టికెట్​కోసం ఆశావహుల ప్రయత్నాలు మరింత ఎక్కువయ్యాయి. తాజాగా ఏఐసీసీ నిర్వహించిన సీడబ్ల్యూసీ మీటింగ్, తుక్కుగూడ విజయభేరి సభ తర్వాత పార్టీలో జోష్​ కనిపిస్తున్నది. దీంతో ఈసారి గెలుపు అవకాశాలు ఉన్నాయంటూ ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది నేతలు ఢిల్లీ బాట పట్టారు. అధినేతల దగ్గర పైరవీ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలం పెరుగుతుందని టీపీసీసీ సర్వేల్లో తేలడంతో.. ఈసారి టికెట్​కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది బెంగళూరుకు కూడా వెళ్లారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో డీకే శివ కుమార్ కూడా కీలకంగా మారడంతో.. ఆయన ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది బీసీ నేతలు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ హరిప్రసాద్ ద్వారా ప్రయత్నాల్లో ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో సంబంధం ఉన్న మాణిక్యం ఠాగూర్​, దిగ్విజయ్​సింగ్, కేవీపీ రామచంద్రారావు, వీరప్ప మొయిలీ ద్వారా కూడా తమ టికెట్​కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. 

పరిశీలన తర్వాతే ఖరారు..

అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ పార్టీ భారీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సర్వే నివేదికలను తెప్పించుకున్న స్క్రీనింగ్ కమిటీ.. ఆయా చోట్ల అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చే నేతలను వెతుకుతున్నది. క్షేత్రస్థాయి పరిశీలన, టీపీసీసీ సర్వే నివేదికల తర్వాత పూర్తిస్థాయిలో వడపోత అనంతరం తమ నివేదికను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పీఈసీ సిఫారసు చేయనుంది. ఇప్పటికే కొన్ని సెగ్మెంట్ల నుంచి సింగిల్, డబుల్ నేమ్ ప్రతిపాదనలతోపాటు ముగ్గురు, నలుగురు నాయకులు పోటీపడుతున్నట్లు పీఈసీ ప్రతిపాదనలు చేసింది. సర్వేలు, సామాజిక, స్థానిక రాజకీయ స్థితిగతుల ఆధారంగా చేసుకుని అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేస్తుందని తెలుస్తున్నది. 

కొన్ని ఖరారు..

రాష్ట్రంలోని దాదాపు 35 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖరారైనట్లుగా పార్టీలో ప్రచారం జరుగుతున్నది. టీపీసీసీ ముఖ్య నేతలతో పాటుగా కొన్ని సెగ్మెంట్లలో ఒక్క పేరు వచ్చిన వాటిని స్ర్కీనింగ్ కమిటీ ఫైనల్​చేసినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్​లతోపాటుగా టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతల పేర్లు ఖరారైనట్లుగా సమాచారం. అయితే దాదాపు 70 నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై సందిద్ధత కొనసాగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సెగ్మెంట్ల నుంచి గతంలో పోటీ చేసిన వారితోపాటుగా టీపీసీసీ సిఫారసుచేసిన వారు ఉన్నారని, దాదాపుగా ప్రతి సెగ్మెంట్ నుంచి ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నట్లు వెల్లడైంది. ఈ సెగ్మెంట్లలో అభ్యర్థులను కొలిక్కి తెచ్చేందుకు స్ర్కీనింగ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమవుతున్నది. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి, ఎంపీ ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను సైతం పిలిచారు. స్ర్కీనింగ్ కమిటీలో ఉత్తమ్ సభ్యులుగా ఉండగా.. పలు అభిప్రాయాల సేకరణ కోసం రేవంత్, భట్టిని పిలిచినట్లు చెబుతున్నారు. 

ఈ నెలాఖరు నుంచి స్టార్ట్..​

అధికార బీఆర్ఎస్​పార్టీ 115 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. అటు బీజేపీ కూడా ఆశావాహుల నుంచి దరఖాస్తులు తీసుకున్నది. ఢిల్లీ పెద్దలకు జాబితా పంపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ కూడా చాలా రోజుల ముందు నుంచే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నది. అయితే కాంగ్రెస్​నేతలు హస్తిన నుంచి ఒత్తిళ్లు తీసుకురావడం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో టికెట్ల ఖరారు కత్తిమీద సాములా మారింది. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ నుంచి కూడా రంగంలోకి దిగారు. అటు డీకే శివ కుమార్ కూడా ఒక వర్గానికి అండగా ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం స్ర్కీనింగ్ కమిటీ పరిశీలన, ఏఐసీసీకి ప్రతిపాదనలు పంపిన తర్వాత ఈ నెలాఖరు నుంచి జాబితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం. తొలుత సింగిల్ పేర్లు ఉన్న 35 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించి.. ఆ తర్వాత వెంట వెంటనే ఆయా సెగ్మెంట్ల అభ్యర్థులను ఖరారు చేయనుందని పార్టీ నేతలు చెబుతున్నారు.