అమెరికాలో టోర్నడో బీభత్సం
అగ్రరాజ్యం అమెరికాపై ప్రకృతి పగబట్టినట్లు ఉంది. గత కొంతకాలంగా మంచు తుఫాన్, భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. తాజాగా లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా రాష్ట్రాన్ని అత్యంత శక్తివంతమైన సుడిగాలి అతలాకుతలం చేసింది. లాస్ ఏంజిల్స్ సమీపంలోని మోంటెబెల్లో నగరాన్ని కుదిపేసింది. ఈ టోర్నడో కారణంగా ఇళ్లు, వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకూలాయి. భవనాల పైకప్పులు గాలికి కొట్టుకుపోయాయి. పెను గాలుల ధాటికి విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కార్ల కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అనేక కార్లు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ టోర్నడో తుపాను వలన ఎటువంటిని ప్రాణ నష్టం జరగలేదు. సుడిగాలి కారణంగా కార్పింటేరియా నగరంలోని శాండ్పైపర్ విలేజ్ మొబైల్ హూమ్ పార్క్లో దాదాపు 25 మొబైల్ హోమ్ యూనిట్లు దెబ్బతిన్నట్లు ఎన్డబ్ల్యూఎస్ తెలిపింది. ఈ సుడిగాలి గంటకు 85 మైళ్ల వేగంతో గాలులు వీచినట్లు అంచనా వేసింది. ‘కాలిఫోర్నియా ప్రమాణాల ప్రకారం ఇది అతిపెద్ద సుడిగాలి, ఇది జనావాస ప్రాంతాలను తాకింది. స్పష్టంగా పెద్ద నష్టాన్ని కలిగించింది’ అని వాతావరణ శాస్త్రవేత్త డేనియల్ స్వైన్ ట్విట్టర్లో తెలిపారు. సుడిగాలి సృష్టించిన విపత్తును తాను స్వయంగా చూసినట్లు స్థానిక వ్యాపారి ఒకరు వెల్లడించారు. కాగా.. అక్కడ తాజా వాతావరణ పరిస్థితుల్ని పరిశోధిస్తున్నట్లు నేషనల్ వెదర్ సర్వీస్ పేర్కొంది.