దళకమాండర్ సందీప్ ను కోర్టులో హాజరు పరచాలి
అధికార పార్టీ నేతలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది: మావోయిస్టు నేత ఆజాద్
ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన శబరి ఏరియా ధర కమాండర్ సందీప్ ను తక్షణమే కోర్టులో హాజరు పరచాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) భద్రాద్రి కొత్తగూడెం_ అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు. పార్టీ కార్యక్రమాలు పై వెళ్లిన సందీప్ ను ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.
ఇప్పటివరకు సందీప్ అరెస్టును పోలీసులు ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. సందీప్ కు ఎలాంటి ప్రాణహాని తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరు పరచాలన్నారు. లేనిపక్షంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల చెందిన అధికార పార్టీ నాయకులు మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు. అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణిచి వేయలేరని అన్నారు.