వంద స్పీడ్ తో వస్తాం!
- పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్దే హవా
- హామీలు నెరవేర్చకపోతే బట్టలిప్పి నిలబెడతాం
- ఉచిత బస్సు ప్రయాణంతో ఆరున్నర లక్షల ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు
- రేవంత్ సర్కార్ పై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది
- బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ముద్ర, తెలంగాణ బ్యూరో : కారు షెడ్ కు వెళ్లలేదు.. సర్వీసింగ్ కు పోయిందని.. త్వరలో మళ్లీ వంద స్పీడ్ తో రాబోతున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కారు స్పీడ్ చూసి కాంగ్రెస్ కు కళ్లుబైర్లు కమ్మడం ఖాయమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది కాంగ్రెస్ కేవలం భూటకపు హామీలతోనేనని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలులు కూడా కాకముందే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. సోమవారం చేవెళ్లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. గాలి హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ కు ముసళ్ల పండుగ ముందుందని వ్యాఖ్యానించారు. మంత్రులు తమ నివాసాల నుంచి బయటకు రావడానికే జంకే విధంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలదీస్తుందని కేటీఆర్అన్నారు. బలమైన ప్రతిపక్షంగా ప్రజల తరపున ప్రశ్నించి పోరాడతామన్నారు. పదేళ్లతో పార్టీ నేతలు, కార్యకర్తలకు మధ్య సమన్వయం లోపించిందని, ఇక ముందు అలా జరగకుండా చూస్తామని చెప్పారు. 14 స్థానాలు ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయామని.. అందులో సగం గెలిచినా హంగ్ వచ్చేదన్నారు.
ఆరున్నర లక్షల ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు..
కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ఇచ్చిన హామీతో ఆరున్నర లక్షల ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ నేతలు 420 హామీలను నెరవేర్చలేక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని బట్టలిప్పి చేవేళ్ల చౌరస్తాలో నిలబెడతామని కేటీఆర్ హెచ్చరించారు. లంకె బిందెలున్నాయని వస్తే ఖాళీ బిందెలున్నాయంటున్న సీఎం రేవంత్ మాటలు విడ్డూరమన్నారు. కనీసం మంత్రిగా పనిచేయని వ్యక్తిని సీఎం చేస్తే ఇలానే ఉంటదని ఎద్దేవా చేశారు. 50 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, రానున్న రోజుల్లో ఇంకా చాలా చూస్తామన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదన్న కేసీఆర్ మాటలను రేవంత్ నిజం చేస్తున్నారని విమర్శించారు. మార్పు కావాలి అన్నోళ్లు.. ఇపుడు నెత్తీనోరు కొట్టుకుంటున్నారని చెప్పారు. ఇప్పటి వరకు రైతు బంధు పడలేదని, రెండు లక్షల రుణమాఫీ, లక్షరూపాయలు.. తులం బంగారం ఎక్కడ అని కేటీఆర్ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్ని కల్లో ప్రజలు తమ చేసిన పొరపాటును చాలా త్వరగానే గుర్తించారన్నారు. అందుకే ప్రజలంతా మళ్లీ బీఆర్ఎస్ వైపే చూస్తున్నారన్నారు. ఇది పార్లమెంట్ ఎన్నికల నుంచే ప్రారంభం కానుందని కేటీఆర్ అన్నారు.