మౌలిక సమస్యలను పరిష్కరించి, మెరుగైన పాలన అందిస్తాం: ప్రభుత్వ విప్ బీర్ల హామీ

మౌలిక సమస్యలను పరిష్కరించి, మెరుగైన పాలన అందిస్తాం: ప్రభుత్వ విప్ బీర్ల హామీ

ఆలేరు. ముద్ర ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ కేంద్రంలోని అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులను బుధవారం నాడు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు, ప్రస్తుతం జరుగుతున్న పనులకు ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూనే పనులను వేగవంతం చేయాలని గుత్తేదారును ఆదేశించారు, యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు, అనంతరం ఆయన మున్సిపాలిటీ పరిధిలోని మూడు, నాలుగు, ఐదు వార్డులలో పర్యటించి, ప్రజలతో నేరుగా మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో అంతర్గత మురుగు కాలువల నిర్మాణం, విద్యుత్ వీధి దీపాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వం ఆలేరు మున్సిపాలిటీ పట్ల శ్రద్ధ చూపకపోవడం వలన నియోజకవర్గ కేంద్రం అయినప్పటికీ అన్ని రంగాలలో వెనుకబాటుతనానికి గురి కావడం బాధాకరమని అన్నారు, ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే కమ్యూనిస్టు నాయకులు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు నరసింహులు విగ్రహం సమీపంలోని మురుగు కాలువ నిర్మాణం చేపట్టి, విద్యుత్ స్తంభాలను ఇతర చోటకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

మరో మారు ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే పట్టణంలోని 12 వార్డులను పర్యటించి సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ గుత్తా శమంత సీతారాం రెడ్డి, చింతలపని సునీత శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంఏ ఎజాజ్, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ నీలం వెంకటస్వామి, బీజని భాస్కర్, నాయకులు వల్లపు ఉప్పలయ్య, నాయకులు జూకంటి సంపత్, కలకుంట్ల లోకేష్ తో పాటు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు