ఏంటి... ఈ రాసలీల

ఏంటి... ఈ రాసలీల
  • కూతురు వయస్సు ఉన్న యువతితో ఏఎస్ఐ రాసలీలలు
  • భర్తకు కౌన్సిలింగ్ ఇవ్వాలని వచ్చిన యువతిని ట్రాప్
  • సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

మెట్‌పల్లి ముద్ర : న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఓ యువతిపై ఏఎస్పై కన్నేశాడు. విచారణ పేరుతో మాటలు కలిపి ట్రాప్ చేశాడు. ఆమెకు ఫోన్ చేస్తూ మరింత దగ్గరయ్యాడు. సదరు యువతితో ఆ అధికారి సన్నిహితంగా ఉన్న ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడం చర్చనీయాంశమైంది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని స్థానికంగా చర్చ జరుగుతోంది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామానికి చెందిన యువతి కొద్ది రోజుల కిందట భర్త త్రాగి వచ్చి కొడుతున్నాడని న్యాయం చేయాలని ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఏఎస్సై రాములు తన భర్తను పిలిపించి కౌన్సిలింగ్ చేశాడు. అయినా భర్త మారకపోవడంతో తరచూ గొడవలు జరిగేవి తరచూ యువతి పోలీస్ స్టేషన్ కు రావడంతో ఆ యువతిపై ఏఎస్ఐ కన్నేశాడు. విచారణ పేరుతో ఆమెను ట్రాప్లోకి దింపాడు. తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఆమెకు దగ్గరయ్యాడు. ఈ విషయం గతంలో ఇక్కడ పని చేసిన ఎస్ఐ మెట్‌పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ఏఎస్సై ను మందలించడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవద్దని త్వరలో రిటైర్మెంట్ ఉన్నదని తన పద్ధతి మార్చుకుంటానని కాళ్లు మొక్కినట్లు సమచారం. అయితే ఆ ఏఎస్సై సదరు యువతితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.  ఈ విషయమై ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ ను 'ముద్ర' వివరణ కోరగా.. ఈ వ్యవహారం రెండు రోజుల క్రితమే తెలిసిందని ఉన్నతాధికారులకు రిపోర్ట్ రాసేందుకు సిద్దమైనట్లు చెప్పారు.