పందెం కోళ్లు లేకపోవడంతో వైసీపీ కేడర్‌ గుర్రు

పందెం కోళ్లు లేకపోవడంతో వైసీపీ కేడర్‌ గుర్రు

కోనసీమకు వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. పండగ బరిలో పందెం కోళ్లు లేకపోవడంతో వైసీపీ కేడర్‌ గుర్రుగా ఉంది. దీంతో అధికార పార్టీ శాసన సభ్యులు సైతం ముఖం చాటేస్తున్నారు. పార్టీ కేడర్‌ సైతం వారిని బాహటంగా విమర్శిస్తున్నారు. రవాణా శాఖా మంత్రి విశ్వరూప్‌ ఎంత ప్రయత్నించినా పందేలకు అనుమతి ఇప్పించలేకపోయారు. కోనసీమ ఎస్పీ సుధీర్‌ కుమార్‌రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకొన్నారు. పండగ వారం రోజులు ముందు నుంచి నాయకులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఓ ప్రక్కన కాకినాడ రూరల్‌ నియోజకవర్గానికి చెందిన శాసన సభ్యులు కురసాల కన్నబాబు ప్రతీ చోటా కోడి పందాలకు అనుమతి ఇప్పించారు. కానీ కోనసీమలో అది జరగలేదు. కోడి పందాలు ఉన్నా, గుండాట, ఇతర వ్యవరాలు లేకపోవడంతో అక్కడక్కడా నామమాత్రంగానే పందాలు జరిగాయి. దీంతో అధికార పార్టీ కేడర్‌ సైతం దుమ్మెత్తిపోస్తున్నారు. మొన్న జరిగిన కోనసీమ అల్లర్ల నేపథ్యంలో జిల్లాలో పార్టీ చులకన అయింది. తాజా వ్యవహారంతో మరింత చులకన అయింది. దీంతో శాసన సభ్యులు సైతం ముఖం చాటేస్తున్నారు.కోడి పందాలు అంటే కోనసీమలోనే జరగాలి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే కోనసీమలో మాత్రం కోడి పందాలు షరా మామూలే. దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి సంక్రాతి సమయంలో చాలా మంది ఇక్కడికి తరలివస్తారు. దీంతో స్థానిక వ్యాపారాలు సైతం వెలిగిపోతాయి. లాడ్జిలు, హోటళ్లు సైతం కిటకిటలాడతాయి. చాలా మంది ఉపాధి పొందుతారు. కోనసీమ జిల్లాలో ప్రతీ కొబ్బరి తోటలోనూ పందాలు జోరుగా సాగుతాయి. ఓ ప్రక్కన సాంప్రదయ క్రీడలతో పాటు ఇతర చాలా సరదాలు కూడా నిర్విరామంగా జరుగుతాయి. సినీ తారలు సైతం ఇక్కడికి వస్తారు.ప్రతీ యేటా వైభవంగా జరిగే కోడి పందాలపై ఎస్పీ ఉక్కు పాదం చూపారు.

 మంత్రి విశ్వరూప్‌ ఇంట్లో నాయకులు సమావేశం అయి విషయం ఎస్పీ దృష్టికి తెచ్చినా ఫలితం లేకుండా పోయింది. గుండాటలు లేకుండా కేవలం కోడి పందాల వరకూనే పర్మిషన్‌ ఇచ్చారు. అయితే లక్షలాది రూపాయిలు చేతులు మారేది గుండాటలో మాత్రమే. దీంతో చాలా మంది కోడి పందాల పట్ల మక్కువ చూపలేదు. చాలా చోట్ల లక్షలు పెట్టి సిద్ధం చేసిన బరులు వెలవెల బోయాయి. పందేల నిర్వహణకు జిల్లా ఎస్పీని ఎంత బతిమాలినా ఫలితం లేకపోయింది.ఇటీవల కోనసీమకు అంబేద్కర్‌ కోనసీమ అనే నామకరణం చేశారు. దీంతో అప్పట్లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. కులాల వారీగా జనం విడిపోయారు. అయితే ప్రస్తుతం కోడి పందాలకు అనుమతి ఇస్తే ఎక్కడో ఒక చోట ఏదో ఒక వివాదం జరుగుతుందని, అది పెద్దది అయి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందనే భయాన్ని వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు మొండిగా వ్యవహరించారనే సమాచారం ఉంది.ఇక కోడి పందేలు లేకపోవడంతో అధికార పార్టీ శాసన సభ్యులు ముఖం చాటేస్తున్నారు. కేడర్‌ కు సమాధానం చెప్పలేకపోతున్నారు. ప్రతీ యేటా అనుమతి ఇచ్చే కోడి పందాలకు ఈ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. కాకినాడ రూరల్‌లో మాజీ మంత్రి, శాసన సభ్యుడు కురసాల కన్నబాబు మాత్రం తన నియోజకవర్గంలో పందాలు జోరుగా వేయించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా చాలా మంది ఇక్కడికి వచ్చారు.