కేసీఆర్ వ్యవసాయాన్ని ఆగం చేసిండు
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల
ముద్ర ప్రతినిధి, జనగామ: రుణ మాఫీ, 24 గంట ఉచిత కరెంట్ అంటూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఆగం చేసిండని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల విమర్శించారు. జనగామ జిల్లాలో కొనసాగుతున్న షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర శుక్రవారం రఘునాథపల్లి మండలం దాసన్నగూడెం, ఖిలాషాపూర్, ఎర్రగుంట తండా, మేకల గట్టు, శంకర్ తండా మీదుగా నర్మెట్ట మండలం మచ్చుపహాడ్ వరకు చేరుకుంది. పాదయాత్ర ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికారు.
ఈ సందర్భంగా ప్రజలతో మాటాముచ్చటలో ఆమె మాట్లాడుతూ 24 గంటలు ఉచిత విద్యుత్ అని కేసీఆర్ రైతులను మోసం చేశాడని ఆరోపించారు. గ్రామాల్లో పంటలు ఎండి పోతున్నాయని రైతులు రోడ్లపై ఆందోళన చేస్తుంటే సీఎంకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ 9 ఏళ్లలో పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2004 కి పూర్వం పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసే ఏకైక పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని చెప్పారు.