బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను కఠినంగా శిక్షించాలి- టిఎస్ యుటిఎఫ్ డిమాండ్

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను కఠినంగా శిక్షించాలి- టిఎస్ యుటిఎఫ్ డిమాండ్

ముద్ర, ముషీరాబాద్: అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పతకాలు సాధించి భారత కీర్తి పతాకను విశ్వవ్యాప్తం చేసిన భారత రెజ్లర్ లపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారత ర్లెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేయాలని, అధ్యక్ష పదవి నుండి తొలగించాలని టీఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేసింది. నెల రోజులుగా మహిళా రెజ్లర్లు చేస్తున్న పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా తాత్సారం చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) తీవ్రంగా ఖండించింది.

రెజ్లర్ల పోరాటానికి మద్దతుగా బుధవారం టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య పార్క్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య మాట్లాడుతూ ఒలింపిక్స్ లో దేశానికి పతకాలు సాధించిన మహిళా క్రీడాకారుల ఆవేదనను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక పోవటం దుర్మార్గమన్నారు.సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్న తర్వాతనే నామమాత్రంగా కేసునమోదు చేసి చేతులు దులుపుకున్నారని, నిందితుడు అధికార పార్టీ ఎంపి కావటంతోనే అతనిపై చర్య తీసుకోకుండా కాపాడుతున్నారని ఆరోపించారు. 

పార్లమెంట్ నూతన భవనం ప్రారంభం రోజున నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న రెజ్లర్లను అడ్డుకుని కేసు పెట్టారని, ఢిల్లీ జంతర్ మంతర్ లో నెల రోజులుగా నడుస్తున్న ఆందోళనా శిబిరాన్ని తొలగించి నిలువ నీడ లేకుండా చేయటం దారుణమన్నారు. ప్రజాస్వామ్య వాదులంతా క్రీడాకారులకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, ఉపాధ్యక్షులు దుర్గాభవాని, కోశాధికారి లక్ష్మారెడ్డి, కార్యదర్శులు సోమశేఖర్, వెంకట్, రాజశేఖర్ రెడ్డి, శాంతకుమారి, నాగమణి, రవికుమార్, శ్రీధర్, సింహాచలం, జ్ఞాన మంజరి, మహబూబ్ అలీ, కొండలరావులతో పాటు పలువురు రాష్ట్ర కమిటీ సభ్యులు ర్యాలీలో పాల్గొన్నారు.