జేపీఎస్​ల సర్వీసు క్రమబద్ధీకరణ

జేపీఎస్​ల సర్వీసు క్రమబద్ధీకరణ
  • విధివిధానాలను ఖరారు చేయండి
  • సీఎం కేసీఆర్​ ఆదేశం

ముద్ర, తెలంగాణ బ్యూరో: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్​నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం కేసీఆర్ ఆదేశించారు. జూనియర్​ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్​ పై సీఎం కేసీఆర్​ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సీఎం సూచించారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్పీ లేదా డీసీపీ మెంబర్లుగా ఉండనున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రస్థాయిలో ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడి స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరని, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటిని వేయనున్నారు.

జిల్లా స్థాయి కమిటి ద్వారా పంపించినటువంటి ప్రతిపాదనను రాష్ట్రస్థాయి కమిటి పరిశీలిస్తుందని. ఆ తర్వాత రాష్ట్రస్థాయి కమిటి చీఫ్ సెక్రటరీకి నివేదికను పంపిస్తుందని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొన్ని గ్రామపంచాయతీలలో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయతీ సెక్రటరీలను జిల్లా కలెక్టర్లు నియమించగా, ఈ స్థానాల్లో కూడా కొత్త జూనియర్ పంచాయతీ సెక్రటరీల భర్తీ ప్రక్రియను, క్రమబద్ధీకరణ తర్వాతి దశలో ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాల్క సుమన్, సీఎం ప్రధాన సలహాదారు సోమేష్ కుమార్,  సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ శాంతి కుమారి, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.