చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్షలో భాగమే జన సేన అధినేత పవన్ కళ్యాణ్
గుంటూరు : ప్రాథమిక ఆధారాలు కూడా చూపించకుండా టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన విధానాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. గతేడాది అక్టోబరులో విశాఖపట్నంలో తమ పార్టీ పట్ల పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో ప్రజలందరూ చూశారని అన్నారు. హత్యాయత్నం కేసులుపెట్టి జనసేన నాయకులను జైళ్ళలో పెట్టారన్నారు. ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పట్ల నంద్యాలలో వ్యవహరించిన విధానం కూడా అలాంటిదేనని, ఆయన అరెస్టును సంపూర్ణంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇది అప్రజాస్వామిక పాలనకు అద్దంపడుతోందన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ అరెస్టు జరిగిందని జనసేన భావిస్తోందని, ప్రతిపక్షాలను అణచివేయాలనే వైసీపీ విధానం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. పాలనాపరంగా అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు పట్ల వ్యవహరించిన తీరు, చిత్తూరులో ఘటనలు చూస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని చెప్పవచ్చు. వైసీపీ నాయకులు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి- శాంతిభద్రతలకు విఘాతం కలిగితే తమ పార్టీ, పోలీసులు, ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం అంటున్నారని, తమకు అర్ధం కాని విషయం ఏమిటంటే- లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయాల్సింది పోలీసు వ్యవస్థ కదా.. దాంతో వైసీపీ వాళ్ళకు సంబంధం ఏంటి? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అసలు వైసీపీ పార్టీ వల్లే రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, మళ్లీ వాళ్లే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తగిన చర్యలు తీసుకుంటామని మాట్లాడుతున్నారని అన్నారు. ఒక పార్టీ అధినేత అరెస్టు అయితే వాళ్ల నాయకులు, అనుచరవర్గం బయటకు వస్తారు. అది ప్రజాస్వామ్యంలో భాగం. ఇళ్ల నుంచి బయటకు వచ్చి తమ నిరసన చెబుతారు. వాళ్ళ నాయకుడికి మద్దతు తెలపొద్దు అంటే ఎట్లా? వైసీపీ నాయకులు మాత్రం అక్రమాలు, దోపీడీలు చేసి జైళ్లకు వెళ్తారు. ఆ తరవాత విదేశాలకు వెళ్లొచ్చు. ఏ తప్పూ చేయకపోయినా ఇతర పార్టీ నాయకులు ఇళ్ల నుంచి బయటకు రాకూడదు అని ఆంక్షలు పెట్టడం ఏమిటి? ఇది శాంతిభద్రతల సమస్య కంటే కూడా రాజకీయ కక్ష సాధింపులో భాగమే అన్నారు.