పోక్సో కేసులో దోషికి 25 యేళ్ల జైలు 

పోక్సో కేసులో దోషికి 25 యేళ్ల జైలు 
  • సంచలన తీర్పునిచ్చిన కొత్తగూడెం కోర్టు
  • కేసు విచారణలో ఆర్టీసీ జేడీ సంగ్రామ్‌ సింగ్‌ కీలక పాత్ర
  • అభినందించిన ఎండీ వీసీ సజ్జనార్‌

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం:
16 నెలల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో కొత్తగూడెం ఫస్ట్ అడిషనల్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దోషికి 25 యేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించలేని పక్షంలో ఆరు నెలల కఠిన కారాగార శిక్ష అదనంగా ఉంటుందని స్పష్టం చేసింది. అప్పటి భద్రాచలం ఏఏస్పీ, ప్రస్తుత టీఎస్‌ఆర్టీసీ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌ స్వయంగా ఈ కేసును దర్యాప్తు చేశారు. నిందితుడికి శిక్ష పడేలా కేసులో ఆధారాలను సేకరించారు. కోర్టు త్వరితగతిన ట్రయల్‌ నిర్వహించేలా చొరవ చూపారు. 2018 జూన్‌లో భద్రాద్రి- కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలానికి చెందిన 22 యేళ్ల అజ్మీరా సాయికిరణ్‌ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పాప తల్లిదండ్రులు శుభకార్యం కోసం వేరే ఊరు వెళ్లగా, బంధువు వద్ద ఉన్న పాపను ఆడిస్తానని చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై దుమ్ముగూడెం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది.  జడ్జి ఎం. శ్యామ్ శ్రీ గురువారం తీర్పును వెల్లడించారు. పోలీసుల తరఫున కేసును అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి లక్ష్మీ వాదించారు. దుమ్ముగూడెం సీఐ దోమల రమేశ్​, కోర్టు డ్యూటీ హెడ్ కానిస్టేబుల్ హరిగోపాల్, కానిస్టేబుల్ సీహెచ్.హనుమంతరావు సహకరించారు. వీరందరినీ ఎస్ పీ  డా.వినీత్.జి తమ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.

సంగ్రాంసింగ్ కు అభినందన
ముద్ర, తెలంగాణ బ్యూరో: కొత్తగూడెం కేసును దర్యాప్తు చేసిన సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌ను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అభినందించారు. హైదరాబాద్‌ బస్‌భవన్‌లో గురువారం ఆయనను సన్మానించారు. బాధిత కుటుంబానికి వేగంగా న్యాయం అందేలా చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు. కెరీర్‌ ప్రారంభంలోనే పొక్సో కేసులో పక్కా సాక్ష్యాధారాలను సేకరించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని కొనియాడారు. పోక్సో కేసులలో నిందితులకు శిక్ష పడటమనేది ప్రస్తుతం ఒక సవాల్‌గా మారిందన్నారు. దుమ్ముగూడెం కేసులో నిందితుడికి 25 యేళ్ల శిక్ష ఖరారు కావడం చరిత్రాత్మకమన్నారు. సంగ్రామ్ సింగ్ ప్రస్తుతం ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తునకు సహకరించిన సీఐ బాలకృష్ణ, హెడ్‌ కానిస్టేబుళ్లు ఎండీ ముజామిల్‌, రాజేంద్రకుమార్‌, హరిగోపాల్‌, కానిస్టేబుల్‌ హనుమంతరావు, అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పీవీడీ లక్ష్మిని కూడా వీసీ సజ్జనార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) డాక్టర్ వి.రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వినోద్ కుమార్, సీపీఎం కృష్ణకాంత్‌, సీటీఎం జీవన్ ప్రసాద్‌, చీఫ్‌ ఇంజనీర్‌ (ఐటీ) రాజశేఖర్‌, సీటీఎం(ఎం అండ్‌ సీ) విజయ్‌ కుమార్‌, చీఫ్‌ మేనేజర్‌(ఫైనాన్స్‌) విజయ పుష్ఫ, తదితరులు పాల్గొన్నారు.